ఆర్కేపురం, జూలై 31: ఇందిరమ్మ రాజ్యంలో మహిళా ఎమ్మెల్యేకు దక్కే గౌరవం ఇదేనా? అని మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్శర్మ, ఆర్కేపురం డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు పెండ్యాల నగేశ్ విమర్శించారు. బుధవారం అసెంబ్లీలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క, ఇతర మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఎన్టీఆర్నగర్ చౌరస్తాలో మురుకుంట్ల అరవింద్శర్మ ఆధ్వర్యంలో సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిండు శాసనసభలో ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డిని అవమానించిన సీఎం, డిప్యూటీ సీఎంతోపాటు మంత్రులు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సబితాఇంద్రారెడ్డిని విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీ వాళ్లకు లేదన్నారు. రేవంత్రెడ్డికి ఏమాత్రం దమ్ము, ధైర్యం ఉన్నా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన ఎమ్మెల్యేలను వెంటనే రాజీనామా చేయించి మళ్లీ ఎన్నికల్లో గెలువాలని సవాల్ విసిరారు.
రేవంత్రెడ్డి పరిపాలనలో రాష్ట్రంలోని ఏ ఒక్క వర్గం సంతోషంగా లేరని మండిపడ్డారు. రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో కూర్చోవడానికి మహిళలే ప్రధాన కారణమని, అలాంటి మహిళలను విమర్శించి బాధ పెట్టడం తగదన్నారు. వెంటనే ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డికి బేషరతుగా క్షమాపాణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాలకొండ శ్రీనివాస్రెడ్డి, గొడుగు శ్రీనివాస్, జై శ్రీమన్నారాయణ, కంచర్ల శేఖర్, మంత్రి రవీందర్రావు, శ్యామ్గుప్తా, శ్రీరాములు, జహీర్, మురళీధర్రెడ్డి, నవీన్గౌడ్, అనురాధ, రోజా, పద్మ, జయమ్మ తదితరులు ఉన్నారు.
బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన
బడంగ్పేట, జూలై 31 : మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బాలాపూర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క దిష్టబొమ్మను బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అర్కల కామేశ్రెడ్డి ఆధ్వర్యంలో దహనం చేశారు. అసెంబ్లీలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అమానించిన రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళల ఆగ్రహానికి గురికాకతప్పదన్నారు.
ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్, కార్పొరేటర్లు అనిల్కుమార్ యాదవ్, రాజేందర్ రెడ్డి, సిద్ధాల లావణ్య బీరప్ప, బీఆర్ఎస్ పార్టీ నాయకులు దిండు భూపేష్ గౌడ్, విజయలక్ష్మి, యాదగిరి, పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సురభి లత, మాధవి, గోపి యాదవ్, బషీర్, నాగరాజు, జంగయ్య, మహేందర్, వెంకటేశ్ తదితరులు ఉన్నారు.
ఓయూలో రేవంత్రెడ్డి దిష్టిబొమ్మ దహనం
ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 31: మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సాక్షిగా రేవంత్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చటారి దశరథ్ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా దశరథ్ మాట్లాడుతూ.. రేవంత్ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దిష్టిబొమ్మ దహనం చేస్తున్న విద్యార్థి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు శిగ వెంకటేశ్గౌడ్, జంగయ్య, నాగేందర్, అవినాశ్, శ్రీకాంత్, రామకృష్ణ, పవన్, సాయి, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.