హైదరాబాద్: ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కృత్రిమ మేధస్సు ప్రభావం శరవేగంగా విస్తరిస్తున్న సమయంలో భారతదేశంలోని Infosys, TCS, Wipro వంటి ప్రముఖ ఐటీ సంస్థల్లో ‘AI Doomsday” కలవరం మొదలైందని.. ఈ పరిణామాలు దేశ యువత భవిష్యత్తు, ఉద్యోగ భద్రతపై తీవ్రమైన ఆందోళనలను కలిగిస్తున్నాయని తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు డా. రేఖా బోయలపల్లి (Boyalapalli Rekha) తెలిపారు.
మీడియా ప్రకటనలో ఆమె.. గత రెండు దశాబ్దాలుగా భారత ఐటీ రంగం దేశ ఆర్థికాభివృద్ధికి వెన్నెముకగా నిలిచిందని పేర్కొన్నారు. లక్షలాది యువతకు స్థిరమైన, గౌరవప్రదమైన ఉద్యోగాలను అందిస్తూ, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భద్రతను కల్పించిందని ఆమె చెప్పారు. ప్రపంచంలోని అతిపెద్ద టెక్నాలజీ సంస్థలు భారతీయుల ప్రతిభపై ఆధారపడి పనిచేశాయని, దీనివల్ల భారతదేశం “గ్లోబల్ టాలెంట్ హబ్”గా ఎదిగిందని రేఖ గుర్తు చేశారు. అయితే, ప్రస్తుతం AI ఆధారిత ఆటోమేషన్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఉద్యోగ అవకాశాలు తగ్గిపోవడం, కొత్త నియామకాలు మందగించడం, ముఖ్యంగా ఫ్రెషర్స్కు అవకాశాలు తగ్గిపోవడం వంటి పరిస్థితులు యువతలో తీవ్ర ఆందోళనను కలిగిస్తున్నాయని ఆమె అన్నారు.
ఒకప్పుడు ప్రపంచం ఉద్యోగాల కోసం భారత్ వైపు చూసేది. కానీ ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంలో భారత యువత తమ భవిష్యత్తు గురించి ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడటం చాలా విచారకరమని రేఖ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పరిస్థితి మనదేశంలోని ఒక పెద్ద విధానపరమైన లోపాన్ని బయటపెడుతోందని ఆమె స్పష్టం చేశారు. గత పది సంవత్సరాలుగా ప్రపంచం AI, Machine Learning, Deep Technology వంటి రంగాల్లో వేగంగా ముందుకు సాగుతున్నప్పటికీ.. భారతదేశం స్వదేశీ AI ఉత్పత్తుల అభివృద్ధి, లోతైన పరిశోధన, ఒరిజినల్ టెక్నాలజీ ప్లాట్ఫార్ముల నిర్మాణంలో తగిన స్థాయిలో పెట్టుబడులు పెట్టలేకపోయిందని ఆమె విమర్శించారు.
ప్రపంచంలోని ఇతర దేశాలు తమ పరిశోధనా వ్యవస్థలను బలోపేతం చేసి, యూనివర్సిటీ–ఇండస్ట్రీ భాగస్వామ్యాన్ని పెంచి.. స్టార్టప్లకు మద్దతు ఇస్తున్నప్పటికీ, భారతదేశంలో ఈ దిశగా అవసరమైన స్థాయిలో చర్యలు కనిపించడం లేదని ఆమె మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం దేశ యువతను భవిష్యత్తుకు సిద్ధం చేయడంలో విఫలమైందని డా. రేఖా బోయలపల్లి తీవ్రంగా విమర్శించారు. ప్రచార కార్యక్రమాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ రాజకీయాలు, నినాదాలు యువతకు ఉద్యోగాలను సృష్టించలేవని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి చురకలు అంటించారు. యువతకు అవసరమైనది నిజమైన అవకాశాలు, ఆధునిక నైపుణ్యాలు, భద్రమైన భవిష్యత్తు అని ఆమె స్పష్టం చేశారు.
భారతదేశం కేవలం సేవల కేంద్రంగా కాకుండా, ప్రపంచాన్ని నడిపించే ఆవిష్కరణల కేంద్రంగా మారాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. ఇందుకోసం స్వదేశీ AI టెక్నాలజీ అభివృద్ధికి భారీ పెట్టుబడులు పెట్టడం, పరిశోధనా సంస్థలను బలోపేతం చేయడం, పబ్లిక్ AI ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించడం, మరియు స్టార్టప్లకు విధానపరమైన ఆర్థిక మద్దతు అందించడం అత్యవసరమని ఆమె సూచించారు. యువతకు AI, కొత్త సాంకేతిక రంగాల్లో శిక్షణ అందించే ప్రత్యేక కార్యక్రమాలను ప్రారంభించాలని, యూనివర్సిటీలు, పరిశ్రమల మధ్య బలమైన భాగస్వామ్యాన్ని ఏర్పరచాలని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దేశ యువత దేశ భవిష్యత్తుకు పునాది అని, వారి భవిష్యత్తు ప్రమాదంలో పడితే దేశ ఆర్థిక వ్యవస్థ కూడా బలహీనపడుతుందని డా. రేఖా బోయలపల్లి హెచ్చరించారు. ఉద్యోగ భద్రత లేకపోతే, యువతలో నిరాశ పెరుగుతుందని, అది దేశ అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆమె అన్నారు.
ప్రచారం ద్వారా కాదు, ఆవిష్కరణ ద్వారా మాత్రమే దేశ భవిష్యత్తు సురక్షితం అవుతుందని ఆమె స్పష్టం చేశారు. భారతదేశం తన ఆర్థిక భవిష్యత్తును, యువత భద్రతను కాపాడుకోవాలంటే స్వదేశీ ఆవిష్కరణ శక్తిని అత్యవసరంగా నిర్మించాల్సిన అవసరం ఉందని ఆమె తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే మేల్కొని, దేశ యువత భవిష్యత్తును రక్షించే విధంగా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని డా. రేఖా బోయలపల్లి డిమాండ్ చేశారు.