మూసీనదిలో 12 ఏండ్ల బాలుడు మృతి
కుక్కల దాడిలోనే మృతిచెందినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
జియాగూడ, మే 24 : చేపలు పట్టడానికి మూసీనదికి వెళ్లిన ఓ బాలుడు వీధి కుక్కల దాడిలో మృతి చెందిన సంఘటన కుల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. ఇన్స్పెక్టర్ టి.అశోక్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం… జియాగూడ సబ్జిమండి ప్రాంతానికి చెందిన మహ్మద్ సయ్యద్ అలీప్ కుమారుడు మహ్మద్ సోఫియాన్ (12) మృతదేహం ఈ నెల 19న ఉదయం 11గంటలకు కేసరిహనుమాన్ దేవాలయం పక్కన మూసీనదిలో లభ్యమైంది. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. కుక్కలు తీవ్రంగా గాయపర్చడంతోనే బాలుడు మృతి చెందినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. దాదాపు ఇరవై కుక్కలు ఒక్కసారిగా దాడిచేయడంతో బాలుడి శరీరంపై దాదాపు 50 చోట్ల గాట్లు ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు.
చేపల వేటకు మూసీకి..!
పాఠశాలలకు వేసవి సెలవులు ఉండటంతో జియాగూడ మూసీనది పరివాహక ప్రాంతాల బస్తీల్లో ఉండే చిన్నారులు చేపల వేట కోసం నిత్యం మూసీనదిలోకి వెళ్తుంటారు. చేపలు పట్టే క్రమంలో వలకు మాసం ముక్కలు తగిలించి మూ సీ నీటిలోకి వలను వేస్తారు. ఈ క్రమంలో సోఫియాన్ చేతి లో మాసం ముక్కలు ఉన్నట్లు పసిగట్టిన వీధి కుక్కలు ఒక్కసారిగా దాడికి దిగి గాయపర్చాయి. తీవ్ర రక్తస్రావం కావడంతో సోఫియాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇదిలా ఉండగా మూసీ సమీపంలో మేకల మండి ఉండటంతో వీధి కుక్కల సంచారం అధికంగా ఉంటుందని, అనేక సందర్భాల్లో చిన్నారులపై దాడికి దిగి గాయపరుస్తున్నాయని స్థానికులు తెలుపుతున్నారు. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ అధికారులు కుక్కల కట్టడికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.