అబిడ్స్, సుల్తాన్బజార్, జనవరి 10 : వృద్ధులు, ఫ్రంట్ వారియర్స్కు బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. 15 – 18 ఏండ్ల పిల్లలకు వ్యాక్సినేషన్ చేస్తున్న సిబ్బంది అన్ని యూపీహెచ్సీల్లో బూస్టర్ డోస్ ఇస్తున్నది. గోషామహల్ నియోజకవర్గం పరిధిలోని అన్ని యూపీహెచ్సీల్లో వైద్య సిబ్బంది వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. బూస్టర్ డోస్ వేయాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగడంతో ఈ నెల 10 నుంచి వేయాలని నిర్ణయించింది. ఆయా యూపీహెచ్సీ కేంద్రాల్లో వ్యాక్సినేషన్ చేస్తున్న తీరును ఎస్పీహెచ్ఓలు పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు.
వైద్య శాఖ అధికారులు, సిబ్బంది ప్రచారం
బూస్టర్ డోస్కు అర్హులైన వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే వారికి వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్లో నమోదు చేసుకున్న అనంతరం వైద్య సిబ్బంది బూస్టర్ డోస్ వేసే కార్యక్రమాన్ని చేపట్టారు. వైద్య శాఖ అధికారులు, సిబ్బంది ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉస్మానియా దవాఖానలో సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్ నేతృత్వంలో వైద్యులు,వైద్య సిబ్బందికి బూస్టర్ డోస్ను అందించారు. గోషామహల్ నియోజకవర్గం పరిధిలోని పన్నిపురా క్లస్టర్ డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ మల్లీశ్వరి, కింగ్కోఠి క్లస్టర్ డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ పద్మజ పరిధిలోని యూపీహెచ్సీలు మహారాజ్గంజ్, బేగంబజార్, ఇసామియాబజార్, ఆర్ఎఫ్పీటీసీ, ఆగాపురా, డీబీఆర్ మిల్, గగన్మహల్, బొగ్గులకుంట, సుల్తాన్బజార్, కోఠి ఈఎన్టీ, కింగ్కోఠి దవాఖానలతో పాటు పన్నిపురా, పురానాపూల్ – 1, పురానాపూల్ – 2 కార్వాన్, దూద్బౌలి, కిషన్బాగ్, యూపీహెచ్సీల్లో సిబ్బంది అందుబాటులో ఉండి వ్యాక్సిన్ కార్యక్రమాన్ని చేపట్టారు.
అర్హులందరూ ముందుకురావాలి
కరోనా కట్టడికి ప్రభుత్వం బూస్టర్ డోస్ వేసేందుకు చర్యలు తీసుకుంటున్నది. 60 ఏండ్లు దాటిన వారు ఫ్రంట్ లైన్ వారియర్స్ బూస్టర్ డోస్ వేయించుకోవాలి. 15 ఏండ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్ వేసుకునేందుకు గాను ప్రభుత్వం నుంచి అనుమతి ఇచ్చింది. తల్లిదండ్రులు తమ పిల్లలకు వ్యాక్సిన్ వేయించాలని కోరారు. మహారాజ్గంజ్ యూపీహెచ్సీలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజశేఖర్తో పలువిషయాలు చర్చించాను.