హైదరాబాద్ : తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే బోనాల ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. శుక్రవారం పరేడ్ గ్రౌండ్లో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల ఉత్సవాలలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించిందని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని పేర్కొన్నారు. ఈ నెల17న జరిగే సికింద్రాబాద్ మహంకాళి బోనాలకు లక్షలాది మంది భక్తులు రానున్నారని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించారు.
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాలు, బతుకమ్మ వంటి అనేక ఉత్సవాలను అనేక దేశాలలో జరుపుకుంటున్నారని, ఇది మనకెంతో గర్వకారణం అన్నారు. కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, ముదిరాజ్ సంఘం సభ్యులు పాల్గొన్నారు.