Shamshabad Airport | హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టుకు మరోసారి బెదిరింపులు కలకలం సృష్టించాయి. లండన్ నుంచి హైదరాబాద్కు వచ్చే బ్రిటీష్ ఎయిర్లైన్స్ విమానంలో బాంబు పెట్టినట్లుగా బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన ఎయిర్పోర్టు సిబ్బంది.. విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. ముందస్తు జాగ్రత్తతో విమానంలోని 200 మంది ప్రయాణికులను దింపారు. అనంతరం బాంబు స్క్వాడ్తో పాటు ఇతర భద్రతా సిబ్బంది విమానాన్ని క్షుణ్నంగా తనిఖీలు చేశాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదకర వస్తువులు కనిపించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
వరుస బెదిరింపు మెయిల్స్ నేపథ్యంలో రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు దృష్టి సారించారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 28 బాంబు బెదిరింపు మెయిల్స్ రావడంపై ఫోకస్ చేశారు. ఈ ఫేక్ బెదిరింపు మెయిల్స్ అన్నింటినీ కూడా డార్క్ వెబ్ను ఉపయోగించి దుండగులు పంపిస్తున్నట్లుగా నిర్ధారించారు. దీంతో ఈ ఫేక్ బెదిరింపు మెయిల్స్పై నమోదైన కేసులను సైబర్ క్రైమ్ విభాగానికి బదిలీ చేయాలని నిర్ణయించింది. ఇలాంటి బెదిరింపులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.