మారేడ్పల్లి, ఆగస్టు 29: తాళం వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేస్తూ.. దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర పుణెకు చెందిన నలుగురు సభ్యులున్న ముఠాను బోయిన్పల్లి పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. నిందితుల వద్ద నుంచి 10 తులాల బంగారు నగలు, 13 తులాల రోల్డ్గోల్డ్ ఆభరణాలు, ఒక ద్విచక్ర వాహనం, రూ. 60 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నార్త్ జోన్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను అదనపు డీపీసీ బి.మధుసూదన్రావు, బేగంపేట ఏసీపీ వీవీఎస్ రామలింగరాజు, బోయిన్పల్లి ఇన్స్పెక్టర్ బి.లక్ష్మీనారాయణరెడ్డితో కలిసి ఉత్తర మండలం డీపీసీ చందనా దీప్తి వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన నీలేశ్ అంకూశ్ కాలే అలియాస్ నీలేశ్ ( 51), ఆకాశ్ భవర్సింగ్ అలియాస్ ఆకాశ్ (21), విశాల్ అనిల్ నలవాడే అలియాస్ విశాల్ (25), శంకర్ జ్ఞానేశ్వర్ అడాగ్లే అలియాస్ శంకర్ (20) ఒక ముఠాగా ఏర్పడ్డారు.
జల్సాలకు అలవాటు పడ్డ ఈ ముఠా ఈ నెల 21న మహారాష్ట్ర నుంచి రైలులో సికింద్రాబాద్కు చేరుకొని రాధా లాడ్జీలో దిగారు. తన వెంట రైల్లో తీసుకొని వచ్చిన ఓ ద్విచక్ర వాహనంపై ఆయా ప్రాంతాల్లో తిరిగి రెక్కీ నిర్వహించి, దొంగతనాలకు ప్లాన్ వేశారు. ఈ క్రమంలో బోయిన్పల్లిలోని బాపూజీనగర్ ప్రాంతానికి చెందిన సీహెచ్. రమేశ్ ఇంట్లో ఈనెల 22న దొంగతనం చేసి విలువైన సొత్తు దోచుకెళ్లారు. బాధితుడు రమేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సీసీ కెమెరాల ద్వారా దర్యాప్తును ముమ్మరం చేశారు. బోయిన్పల్లి చోరీ కేసులో నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా నేరాలు అంగీకరించారు. ఈ ముఠాలోని మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు డీసీపీ తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన బోయిన్పల్లి పోలీసు సిబ్బందిని నార్త్ జోన్ డీసీపీ అభినందించారు. ఈ సమావేశంలో బోయిన్పల్లి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ వి.సదర్ నాయక్, ఎస్ఐలు, క్రైం సిబ్బంది పాల్గొన్నారు.