వరంగల్, జూలై 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): విపత్కర పరిస్థితుల్లో ప్రతిపక్షాలు రాజకీయాలు చేయొద్దని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ హితవు పలికారు. ఆదివారం సాయంత్రం బాలసముద్రంలోని హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ నెలలో కురిసిన వర్షాల వల్ల తెలంగాణలో భారీగా నష్టం వాటిల్లిందని చెప్పారు. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి ఆదివారం భూపాలపల్లి, వరంగల్ నగరంలో పర్యటించి కేంద్ర సాయం ప్రకటిస్తారని అనుకుంటే పనికిమాలిన వాఖ్యలు చేశారని మండిపడ్డారు.
కేంద్ర మంత్రి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. కేంద్రం ఇది చేసింది, రాష్ట్రం ఏమి చేయడం లేదని ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసేందుకు ఇది సమయం కాదని అన్నారు. ప్రజలకు ధైర్యం కల్పించి భరోసా కల్పించాల్సింది పోయి తప్పుతోవ పట్టించడం భావ్యం కాదని హితవు పలికారు. కేంద్ర ప్రభుత్వం నడిచేది రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల రూపంలో కట్టే డబ్బులతోనని గుర్తుచేశారు. జాతీయ విపత్తులు నిర్వహణ యాక్ట్ కింద నిధులు ఇచ్చి ఖర్చు చేయకుండా అనేక కొర్రీలు పెడుతున్నారని, పంట నష్టం కింద సీఎం కేసీఆర్ ఎకరాకు రూ.10 వేలు ఇస్తానంటే రూ.3,500 మాత్రమే ఇవ్వాలనే నిబంధన పెట్టింది కేంద్రం కాదా? ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వాలను కించపరిచేలా మాట్లాడితే జాతీయ సమైక్యతకు ముప్పు వస్తుందని తెలిపారు. రేవంత్రెడ్డి, కిషన్రెడ్డి మాటలను ప్రజలు గమనిస్తున్నారని వెల్లడించారు. రాజకీయాలు మాట్లాడకుండా ప్రజలకు అందరం కలిసి ఎలాంటి ధైర్యం, భరోసా ఇవ్వాలనే దానిపై ఆలోచించాలని పేర్కొన్నారు. భారీ వర్షాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నామని తెలిపారు. భద్రకాళి, వడ్డేపల్లి చెరువులకు సంబంధించి నాళాలకు రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేయనున్నామని వివరించారు. నాలాలపై సీఎం కేసీఆర్కు సంపూర్ణ అవగాహన ఉన్నదని, వరంగల్ను వరద ముప్పు నుంచి రక్షించేందుకు పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు స్పష్టం చేశారు.
చీఫ్ విప్ దాస్యం మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వరదలపై ఎప్పటికప్పుడు సమీక్షించి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారని చెప్పారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తం కావడంతో ప్రాణనష్టాన్ని నివారించామని వెల్లడించారు. గతంలో జరిగిన ప్రాంతాల్లో కాకుండా ఈ సారి ఇతర ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయని తెలిపారు. సమావేశంలో కుడా చైర్మన్ సంఘంరెడ్డి సుందర్రాజ్యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ఖాన్, రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, మైనార్టీ కమిషన్ సభ్యుడు దర్శన్సింగ్, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి పాల్గొన్నారు.