సిటీబ్యూరో, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్లో ఐటీ ఉద్యోగాల ముసుగులో బోగస్ కంపెనీలు నిరుద్యోగులను మోసం చేస్తున్నాయి. యువతను లక్ష్యంగా చేసుకుని ఉద్యోగాలు ఇస్తామంటూ చెప్పి శిక్షణ పేరుతో రూ.లక్షలు వసూలు చేస్తున్నాయి. గత ఏడాది హైదరాబాద్లో సుమారు 50 నకిలీ కంపెనీలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇటీవల గుంటూరు జిల్లాకు చెందిన ఓ యువకుడు మాదాపూర్లో కంప్యూటర్ కోర్సు నేర్చుకుంటున్నారు. శిక్షణ కేంద్రం వద్దకు వచ్చిన ఓ దళారీ అతడికి ఐటీ ఉద్యోగం ఇప్పిస్తామంటూ నమ్మించి రూ.2.5 లక్షలు వసూలు చేశారు.
మెదక్ జిల్లాకు చెందిన ఓ యువతి హెచ్ఆర్ మేనేజర్కు రూ.2.5 లక్షలు ఇచ్చింది. వీరిద్దరికీ ల్యాప్టాప్లు ఇచ్చారు. రెండునెలల శిక్షణ పేరుతో రూ. 22వేల చొప్పున జీతం ఇచ్చారు. ఆ తర్వాత ప్రాజెక్టులు రావడం లేదంటూ బోర్డు తిప్పేశారు. ఐటీ కంపెనీల పేరుతో మోసగాళ్లు మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్పల్లి, నానక్రాంగూడ, అమీర్పేట, హైటెక్సిటీ తదితర ప్రాంతాల్లో కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్లేస్మెంట్స్ కోసం కోర్సులు నేర్చుకుంటున్న వారు ఆయా కంపెనీల మాటలు నమ్మి వారు అడిగినంత చెల్లించి ఆ తర్వాత మోసపోతున్నారు.
కొందరైతే ఏకంగా ఇంజినీరింగ్ కళాశాలలకు వెళ్లి క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ప్లేస్మెంట్స్కు సంబంధించి కొందరిని ఎంపిక చేసుకుని వారికి ఆఫర్ లెటర్లు ఇచ్చి తీరా విద్యార్థులు బయటకు వచ్చిన తర్వాత వారికి కొంత శిక్షణ అవససరమంటూ చెప్పి..ఒక్కొక్కరి దగ్గర నుంచి రూ.2-3 లక్షలు తీసుకుంటున్నారు. 50 నుంచి 60 మంది నుంచి డబ్బులు రాబట్టాక రాతపరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక పూర్తి చేస్తారు. మొదట శిక్షణ పేరుతో రూ.20-25వేల చొప్పున జీతం ఇస్తారు. నాలుగైదు నెలలు కాగానే, కొత్త ప్రాజెక్టులు రాలేదని తర్వాత పిలుస్తామంటూ బురిడీ కొట్టిస్తారు. బోర్డు తిప్పేసి, మరోచోట కొత్త కంపెనీ ప్రారంభిస్తారు. బాధితులు ఫోన్ చేస్తే కొత్త కంపెనీలో చేరేందుకు అదనంగా మరికొంత డబ్బులు చెల్లించాలంటూ డిమాండ్ చేస్తారు. పోలీస్స్టేషన్కెళ్లి ఫిర్యాదు చేసినా ఫలితం దక్కడం లేదని కొందరు బాధితులు చెబుతున్నారు.