సిటీబ్యూరో, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ) ;కమలం పార్టీ రాజకీయ క్రీడలో కొత్తవారికి చేదు అనుభవం ఎదురవుతున్నది. ఆ పార్టీపై గంపెడు ఆశలతో కాషాయం కండువా కప్పుకోవడానికి ఊవిళ్లూరిన వారందరికీ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ఘోర పరాభవం ఎదురవుతున్నది. తొలుత పార్టీలోకి రమ్మని పిలిచి.. తేదీ నిర్ణయించి.. ఏర్పాట్లు చేసుకున్నాక తీరా సమయానికి బీజేపీ అగ్రనాయకులు హ్యాండిచ్చి.. ఆ నాయకులను జోకర్లుగా పరిగణిస్తున్నారు. అలా అవమానించాక కొన్ని రోజుల తర్వాత మళ్లీ వద్దనుకున్న వారినే పార్టీలోకి ఆహ్వానించి.. బీజేపీ అగ్ర నాయకులు కండువా కప్పి వికృత ఆనందం పొందుతున్నారు. ఈ పరిణామాలతో కమలం పార్టీలోకి కొత్తగా ఎవరైన రావాలనుకునే వారు సైతం వెనకడుగు వేస్తున్నారు.
తూతూ మంత్రంగా..
ఇటీవల మాజీ మంత్రి కృష్ణ యాదవ్, చికోటి ప్రవీణ్ కుమార్తో పాటు మరొకరికి బీజేపీ నుంచి చేదు అనుభవమే ఎదురైంది. బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ మాజీ మంత్రి కృష్ణ యాదవ్ను పార్టీలోకి తీసుకురావడానికి అంతా సిద్ధం చేశారు. చేరిక తేదీని ఖరారు చేశారు. అందుకు సంబంధించి కృష్ణ యాదవ్ తన అనుచరులు, కార్యకర్తలను సిద్ధం చేసుకుని పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకున్నారు. తీరా సీన్ కట్ చేస్తే..ఆయన రాకకు అప్పట్లో బ్రేకులు పడ్డాయి. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండాల్సి ఉండగా, అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో కృష్ణ యాదవ్ పరిస్థితి వివాదాస్పదమైంది. ఈ వ్యవహారం ఈటల వర్సెస్ కిషన్రెడ్డిగా మారింది. ఇప్పుడు మళ్లీ కృష్ణ యాదవ్ను పార్టీలోకి ఆహ్వానించి తూతూ మంత్రంగా చేర్చుకున్నారు. మరో నాయకుడు చికోటి ప్రవీణ్ కుమార్ను పార్టీలోకి పిలిచి కృష్ణయాదవ్ కంటే రెట్టింపు స్థాయిలో అవమానించారు. ర్యాలీగా బయలుదేరి డప్పు చప్పుళ్లతో కాన్వాయ్గా వచ్చిన చికోటికి పార్టీ కార్యాలయంలో కండువా కప్పే వారు లేకపోవడంతో ఆయన అక్కడి నుంచి వెనుతిరిగి వెళ్లాల్సి వచ్చింది. ఈ వ్యవహారం కిషన్రెడ్డి వర్సెస్ బండి సంజయ్గా మారింది. కాగా, చికోటి ప్రవీణ్ డీకే అరుణ సమక్షంలో బీజేపీలో చేరడం విశేషం. ఎటువంటి అంగు ఆర్భాటం లేకుండా బోసిపోయినట్టుగా ఈ కార్యక్రమం ముగిసింది. అంతేకాదు బీజేపీ అగ్ర నాయకులు కిషన్రెడ్డి లేకపోవడం తెలిసిన విషయమైనా.. మిగిలిన నాయకులు బండి సంజయ్, ఈటల రాజేందర్ కూడా హాజరు కాలేదు. చాలా మంది నాయకులకు ఇలాంటి అవమానాలే ఎదురయ్యాయని ఆ పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు. అగ్రనాయకుల వ్యవహారంతో కొత్త వారు ఇక కమలంలో చేరడం అంటూ ఉండదని చెబుతున్నారు.
ఓటమి భయంతోనే..
బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో ఉన్న అభిమానం ముందు ఏ పార్టీ నిలవలేదనే విషయాన్ని గ్రహించిన కమలం పెద్దలు..ఆ పార్టీలోకి వచ్చే వారిపై పెద్దగా ఆశలు పెట్టుకోవడం లేదు. అందుకే ఆ పార్టీ నాయకులు చేరికలను పట్టించుకోవడం లేదని సమాచారం. గ్రేటర్లో రెండు, మూడు చోట్ల గెలవడమే కష్టంగా భావిస్తున్న ఆ పార్టీ వివాదాస్పద వ్యక్తులను పార్టీలోకి ఆహ్వానించి.. ఉన్న డిపాజిట్లు కోల్పోకూడదని ఓ వర్గం భావిస్తున్నట్టు తెలిసింది. ఇదే క్రమంలో మరో వర్గం పార్టీలోకి వచ్చేవారు ఎలాంటి వారైనా చేర్చుకోవాల్సిందేనని చెబుతున్నది. ఇక చేరికల కమిటీ ఉండి.. ఏం లాభం అంటూ కిషన్ రెడ్డిపై ఒత్తిడి తీసుకొస్తుండటంతో ఆయన గతంలో తాను వద్దనుకున్న వారిని సైతం పార్టీలోకి ఆహ్వానించేందుకు సిద్ధపడుతున్నట్లు తెలిసింది.