రంగారెడ్డి, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): మహేశ్వరం నియోజకవర్గంలో రోజురోజుకూ చేరికల జోరు పెరుగుతుండడంతో బీఆర్ఎస్ బలగం మరింతగా పెరుగుతున్నది. ముఖ్యంగా బీజేపీ నుంచి చాలామంది స్థానిక సంస్థల ప్రతినిధులతోపాటు సామాన్య కార్యకర్తలు సైతం గులాబీ గూటికి చేరుతున్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సారథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ నుంచి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. ఆయా పార్టీల్లో వర్గపోరుతో విసిగిపోయిన నాయకులు, కార్యకర్తలు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ వైపు ఆకర్షితులవుతున్నారు. తాజాగా.. గురువారం కందుకూరు మండలం పులిమామిడి ఎంపీటీసీ రాజమ్మ బీజేపీని వీడి మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆమెతో పాటు ఆమె అనుచరులు పెద్ద సంఖ్యలో గులాబీ కండువాలు కప్పుకున్నారు. వీరితోపాటు కాంగ్రెస్ పార్టీలకు చెందిన వెయ్యికి మందికి పైగా బీఆర్ఎస్ గూటికి చేరారు.
మహేశ్వరం నియోజకవర్గంలో వరుసగా కాంగ్రెస్, బీజేపీ నుంచి బీఆర్ఎస్లోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ నాయకత్వ పోకడలు నచ్చక ఆ పార్టీలను వీడుతున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై వివక్షతను ప్రదర్శించడం..గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలతోపాటు నిత్యావసర ధరలు పెరగడంతో సామాన్యులు కాషాయ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయానికి మూడు గంటల కరెంటే చాలు అన్న కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలపైనా జనం మండిపడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ వైఖరిలు నచ్చక గడచిన కొద్ది రోజులుగా వరుస పెట్టి చాలామంది గులాబీ కండువా కప్పుకుంటున్నారు. ఇటీవలే బీజేపీ లీగల్ సెల్ రాష్ట్ర సెక్రటరీగా పనిచేసిన టేకుల భాస్కర్ రెడ్డి తన అనుచరవర్గంతో బీఆర్ఎస్లో చేరారు. కొద్దిరోజుల కిందట తుక్కుగూడలో బీజీపీ, కాంగ్రెస్ల నుంచి నాయకులు, కార్యకర్తలు గులాబీ కండువాలు కప్పుకున్నారు. మాజీ వార్డు సభ్యులు, ముఖ్య నాయకులు సైతం ఇందులో ఉన్నారు. ఆర్కేపురం, సరూర్నగర్ల నుంచి కూడా ఇటీవలి కాలంలో వలసలు ఊపందుకున్నాయి. నియోజకవర్గం నలుమూలల నుంచి వివిధ పార్టీల వారు బీఆర్ఎస్కు జై కొడుతున్నారు. మరోవైపు రానున్న రోజుల్లో బీజేపీ, కాంగ్రెస్ల నుంచి చాలామంది కారెక్కేందుకు సిద్ధమవుతుండటంతో ఉన్న వారిని కాపాడుకోలేక ఆ రెండు పార్టీలు సతమతమవుతున్నాయి.
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితా రెడ్డి నేతృత్వంలో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతోంది. ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకుంటూ మంత్రి విరివిగా నిధులు మంజూరు చేస్తున్నారు. ప్రతి నిత్యం ప్రజల్లోనే ఉంటూ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, ఇండ్ల పట్టాల పంపిణీ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. స్వల్ప కాల వ్యవధిలోనే అభివృద్ధి పనులను పూర్తి చేయించారు. సీఎం కేసీఆర్ సైతం మహేశ్వరం నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్నారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గానికి వచ్చిన సీఎం కేసీఆర్.. పలు హామీలు ఇచ్చి మాట నిలబెట్టుకున్నారు. నియోజకవర్గ పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీలకు రూ.160.90 కోట్లను మంజూరు చేశారు. తుమ్మలూరులో దశాబ్ది కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కోటి రూపాయలను మంజూరు చేశారు. ఫలితంగా నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నది.