అనుమతి లేకుండా విగ్రహం ఏర్పాటు
తొలగించిన మున్సిపాలిటీ సిబ్బంది..
మణికొండ, జూన్ 13 : అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహాన్ని మున్సిపాలిటి సిబ్బంది ఆదివారం తొలగించారు. దీంతో నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. వివరాలిలా ఉన్నాయి. అల్కాపూర్ కాలనీలో ప్రతిష్ఠించిన శివాజీ విగ్రహాన్ని తొలగించడంపై మణికొండ మున్సిపాలిటీలో సోమవారం బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. సోమవారం బీజేపీ శ్రేణులంతా కలిసి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మున్సిపల్ కార్యాలయంలోకి చొరబడి ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. అధికారులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ఉద్రిక్తత వాతావరణాన్ని సృష్టించారు. నార్సింగి, రాయదుర్గం పోలీసులు అక్కడకు చేరుకుని నిరసనకారులను అరెస్టు చేసి, పోలీస్స్టేషన్కు తరలించారు. ఈ పరిణామంపై మణికొండ మున్సిపల్ వైస్ చైర్మన్ కె.నరేందర్రెడ్డి సీరియస్ అయ్యారు. అధికారుల తీరుపై మండిపడ్డారు. ఈ ఆందోళనలో బీజేపీ నాయకులు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
మణికొండ, జూన్ 13 : మున్సిపాలిటీ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన విగ్రహాన్ని తొలగించిన అధికారులపై దురుసుగా ప్రవర్తిస్తూ మున్సిపల్ ఉద్యోగులపై, మహిళలపై అనుచితంగా వ్యవహరించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మణికొండ మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని అల్కాపూర్ టౌన్షిప్లో మున్సిపాలిటీ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఆదివారం ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహాన్ని మున్సిపాలిటీ అధికారులు తొలగించడంపై కొంతమంది అసాంఘిక శక్తులు మూకుమ్మడిగా మున్సిపల్ కార్యాలయంలోకి చొరబడి ఫర్నిచర్ ధ్వంసం చేసి, అక్కడ ఉద్యోగులను భయాందోళనలకు గురిచేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. నిబంధనల ప్రకారం విగ్రహ ఏర్పాటు కోసం మున్సిపాలిటీ నుంచి అనుమతులు పొంది ఏర్పాటు చేస్తే ఎలాంటి ఇబ్బందులు తలెత్తేవి కావని నిబంధనలను ఉల్లంఘించడంతోనే అధికారులు విగ్రహాన్ని తొలగించారని పార్టీ ఫ్లోర్లీడర్ కె.రామకృష్ణారెడ్డి, పార్టీ అధ్యక్షుడు బి.శ్రీరాములు అన్నారు. అన్ని వర్గాలకు సముచితమైన స్థానం కల్పించడమే టీఆర్ఎస్ పార్టీ ప్రధాన ఉద్దేశమని వారు గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఆలస్యం నవీన్కుమార్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు యాలాల నరేశ్కుమార్, నాయుడు, లక్ష్మయ్య, లక్ష్మీశ్రీ, బషీర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.