సిటీబ్యూరో, డిసెంబర్15(నమస్తే తెలంగాణ )/చిక్కడపల్లి : కాంగ్రెస్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడితే..రాజ్యాంగాన్ని బీజేపీ ధ్వంసం చేస్తున్నదని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు విమర్శించారు. ప్రపంచంలో ఎలక్టోరల్ డిక్టేటర్షిప్ అనే కొత్త సంస్కృతి తెరపైకి వచ్చిందని వివరించారు. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని తెలిపారు. ఒకే దేశం-ఒకే ఎన్నిక కూడా నియంతృత్వానికి దారి తీస్తుందని చెప్పారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) సీనియర్ నాయకుడు అక్షయ్ కుమార్ దత్ ప్రథమ వర్ధంతి ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానుద్దేశించి ఆయన మాట్లాడుతూ.. భారతీయులు విశ్వ మానవులని, వారికి స్ఫూర్తి రాజ్యాంగమేనన్నారు.
అక్షయ్ కుమార్ దత్ విశ్వ మానవుడని కొనియాడారు. లౌకికవాది, మానవతావాది, సమతావాది, కులం, మతం, ప్రాంతం, రంగులకు అతీతంగా సమానత్వం కోరుకున్న వారు విశ్వ మానవులని చెప్పారు. దత్ అస్థిత్వం విశ్వ మానవ లక్షణం అన్నారు. భారతీయులందరికి సమానమైన హక్కులు ఉండాలని.. అమెరికా లాంటి పెట్టుబడిదారీ దేశాల్లో అమలవుతున్న పౌరసత్వ ప్రాతిపదిక జాతీయ వాదం (సిటిజన్ బేస్డ్ నేషనలిజం) మన దేశంలో అమలు కాకుండా అడ్డుకోవడానికి ముస్లింలను మినహాయించి పౌరసత్వ సవరణ చట్టం చేయబూనుకున్నారని ఆరోపించారు.
రాజ్యాంగ లక్ష్యాలైన ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సమాఖ్యవాదం, సామాజిక న్యాయం, సామ్యవాదం కాపాడబడాలని చెప్పారు. మతం వ్యక్తిగతమని.. రాజ్యం జోక్యం ఉండకూడదన్నారు. పెట్టుబడి దారి సమాజంలో అసమానతలు పెరిగాయని ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారీ వ్యవస్థ పట్ల వ్యతిరేకత, సామ్యవాద భావనకు మద్దతు పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, సీఐటీయూ ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య, టీఎస్ యూటీఎఫ్ సీనియర్ నాయకులు మాణిక్ రెడ్డి, నరహరి, కమలకుమారి, సింహాచలం తదితరులు పాల్గొన్నారు.