హైదరాబాద్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ పరం చేయడంలో ఉన్న శ్రద్ధ, చిత్తశుద్ది కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు.
మంగళవారం సికింద్రాబాద్లోని రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో జరుగుతున్న నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్ 30 వ జాతీయ మహాసభలలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అతి పెద్ద రవాణా వ్యవస్థగా రైల్వే శాఖకు ఎంతో గుర్తింపు ఉందన్నారు. కొవిడ్ మహమ్మారి సమయంలో సైతం వేలాది గూడ్స్ రైళ్లను నడిపి దేశంలోని వివిధ ప్రాంతాలకు సరుకులను సరఫరా చేశారని, ప్రత్యేక రైళ్లను నడిపి కార్మికులు తమ నిబద్ధతను చాటుకున్నారని అన్నారు.
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఇండియన్ ఎయిర్ లైన్స్, ఇన్సురెన్స్ లను ప్రైవేట్ పరం చేయడమే కాకుండా రైల్వే ను కూడా ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. కార్మికులు ఆందోళన చెందవద్దని, దేశం మొత్తం మీ వెంటే ఉంటుందని స్పష్టం చేశారు.
రానున్న ఎన్నికలలో బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సంఘం అధ్యక్షుడు గుమన్ సింగ్, జనరల్ సెక్రటరీ రాఘవయ్య, వెంకట సుబ్బమ్మ, ప్రభాకర్ ఆడ్సు, భాను ప్రసాద్, శేఖర్ రాం, ఆడం సంతోష్ తదితరులు పాల్గొన్నారు.