Moinabad | రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో యువతి మృతి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాకారం గ్రామ పరిధిలోని పంట పొలాల్లో కాలిపోయిన యువతి మృతదేహం దొరికిన కేసును పోలీసులు చేధించారు. సదరు యువతిది హత్య కాదు.. ఆత్మహత్య అని తేల్చారు. మంటల్లో కాలిపోయిన మృతురాలిని హైదరాబాద్లోని మల్లేపల్లికి చెందిన తహసీన్(22)గా గుర్తించారు. స్నేహితురాలికి దూరమైందనే మనస్తాపంతోనే ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు నిర్ధారించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని మల్లేపల్లికి చెందిన తహసీన్ చదువు పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉంది. మూడు రోజుల క్రితం ఇంట్లో గొడవపడి బయటకు వెళ్లగా.. అప్పట్నుంచి ఆమె గురించి వెతుకుతున్నారు. ఈ క్రమంలో జనవరి 8న బాకారం సమీపంలో కాలిపోతున్న స్థితిలో మృతదేహాన్ని గమనించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మంటలను ఆర్పేసిన పోలీసులు.. ఘటనాస్థలిలో దొరికిన వస్తువుల ఆధారంగా విచారణ జరిపారు. యువతిది హత్యగా ప్రాథమికంగా భావించిన పోలీసులు.. ఆదిశగా దర్యాప్తు జరిపారు. చివరకు ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారించారు. ఇంటి నుంచి బయటకు వచ్చేసిన తహసీన్.. ఆటోలో బాకారం సమీపంలోకి వచ్చిందని. మధ్యాహ్నం 2 గంటల సమయంలో తనతో తెచ్చుకున్న పెట్రోలు పోసి నిప్పంటించుకుందని తేల్చారు. ఆత్మహత్యకు ఒక్కరోజు ముందే 5 లీటర్ల పెట్రోలు తీసుకుని ఫ్రెండ్ ఇంట్లో దాచిపెట్టినట్లు కూడా తెలిసింది.
కాగా, గతంలోనూ రెండుమూడు సార్లు తహసీన్ ఆత్మహత్యకు యత్నించినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. ఇంట్లో గొడవపడి బయటకు వెళ్తే ఒకటి రెండు రోజుల్లోనే తిరిగివచ్చేదని.. అందుకే ఈసారి కూడా అలాగే వస్తుందని అనుకుని.. పోలీసులకు ఆలస్యంగా ఫిర్యాదు చేసినట్లు తల్లిదండ్రులు పోలీసులకు చెప్పినట్లు సమాచారం.