పర్యావరణ రక్షణే లక్ష్యంగా సైక్లింగ్ రైడ్స్ ఏర్పాటు
ఆఫీసు, స్కూల్కు ప్రయాణించేలా అవగాహన
జూన్ 3న ప్రపంచ సైకిల్ దినోత్సవం
సిటీబ్యూరో, మే 31(నమస్తే తెలంగాణ) : సైకిల్ తొక్కుతూ.. బడికి పొదాం ! సైకిల్ తొక్కుతూ.. ఆఫీస్కు పొదాం..! సైకిల్ తొక్కుతూ.. కిరాణాస్టోర్కు వెళుదాం..! ఇలా ప్రతి పనికి సైకిల్ వినియోగించి.. కాలుష్యం నివారిద్దాం.. అనే నినాదాలు నగరంలో క్రమంగా వినిపిస్తున్నాయి. సిటీలో సైక్లింగ్ వినియోగం విరివిగా పెరుగడంతో సైకిళ్ల కొనుగోళ్లు రెట్టింపు అయ్యాయని వ్యాపారులు చెబుతున్నారు. సైక్లింగ్తో ఆరోగ్యంగా ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు తెలిపారు. సైక్లింగ్ ప్రాధాన్యతను చాటడానికి నగర సైక్లిస్టులు విశేష కృషి చేస్తున్నారు. జూన్ 3న ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా నగరంలోని పలువురి సైక్లిస్టులతో నమస్తే తెలంగాణ ముచ్చటించింది.
సైకిల్పైనే స్కూల్కు..
మా పేరు ఎన్.ప్రణతి, సాహితి. మేమిద్దరం అక్కాచెల్లెల్లం. మేము ప్రతి రోజు 8 కిలోమీటర్లు సైకిల్పైనే స్కూల్కు పోతాం. సైక్లింగ్ అంటే మాకు చాలా ఇష్టం. మా పేరేంట్స్ బైక్ మీద తీసుకెళతామని చెప్పినా… మేము సైకిల్పైనే వెళతామని అంటాము. కాలుష్యం ఎక్కువైతే జరిగే అనర్థాల గురించి మనం పాఠాల్లో చదువు కుంటున్నాం. అందరూ సైక్లింగ్ ప్రాధాన్యతను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. – ఎన్.ప్రణతి, సాహితి
ప్రతీరోజు ఆఫీస్కు..
సైక్లింగ్ను ప్రమోట్ చేయడానికి కార్పొరేట్ కంపెనీలు ముందుకొస్తున్నాయి. యూరోనిక్స్ కంపెనీ నగరానికి చెందిన తమ ఉద్యోగులకు సైకిళ్లను అందించింది. కంపెనీ సౌత్ ఇండియా హెడ్ సాదిక్ సైకిల్ వినియోగం పెరగాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సోషల్ మీడియా వేదికగా వివరించారు. ఈ కంపెనీ ఉద్యోగులు అందరూ సైకిల్పైనే ఇంటి నుంచి ఆఫీస్కు వెళుతుంటారు. నేను చిన్నప్పుడు సైకిల్ తొక్కేదాన్ని. 12 ఏండ్ల అవుతుంది సైకిల్ తొక్కక. కానీ ఇప్పుడు మాకు కంపెనీ సైకిల్ అందించడంతో సైకిల్ తొక్కడం ప్రారంభిం చాను. చాలా సంతోషంగా ఉంది.
– దివ్య, ఉద్యోగి
హరితహారం స్ఫూర్తి
కాలుష్యంతో ప్రాణికోటికి పెనుముప్పు పొంచి ఉంది. కొవిడ్ కన్నా కాలుష్యం ద్వారా వచ్చే వ్యాధుల వల్ల మరణించిన వారి సంఖ్య ఎక్కువగా ఉందని ఐక్యరాజ్యసమితి పర్యావరణ నివేదిక హెచ్చరించింది. ప్రపంచ వ్యాప్తంగా ఏటా 90 లక్షల మంది చనిపోతున్నారని నివేదిక సూచించింది. తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం హరితహారం పేరుతో మొక్కలు నాటే కార్యక్రమం చాలా విలువైనది. మేం కూడా మా విధిగా మొక్కలు నాటుతున్నాం. సైక్లింగ్తో నగరవాసుల్లో అవగాహన కల్పిస్తున్నాం. – మోనిక, హైదరాబాద్ సైక్లిస్టు
సైక్లింగ్కు హైదరాబాద్ అనుకూలం
పర్యావరణ పరిరక్షణకు అండగా నిలుస్తున్న ప్రతీ కార్యక్రమానికి మేం మా వంతు బాధ్యతను నిర్వర్తిస్తాం. కాలుష్యం తగ్గించడానికి వాహనాల వినియోగం తగ్గించాలి. అందుకు సైక్లింగ్ వినియోగం పెరగాల్సిన అవసరం ఉంది. దేశ వ్యాప్తంగా మేం కాశ్మీర్ టూ కన్యాకుమారి వరకు చుట్టొచ్చాం. సైక్లింగ్కు అనువైన వాతావరణం హైదరాబాద్లోనే ఉంది. సైక్లింగ్ వినియోగం పెంచడమే మా ప్రధాన లక్ష్యం.
– వి. రవీందర్, ప్రెసిడెంట్, హైదరాబాద్ సైక్లిస్టు గ్రూప్
సైక్లింగ్ వినియోగం
నా పేరు ఉమా మహేశ్. సైకిల్ తొక్కడమనేది నాకు అలవాటు. నేను కెనరా బ్యాంక్ ఉద్యోగిని. ఇంటి నుంచి ప్రతీ రోజు సైకిల్పైనే కార్యాలయానికి వెళుతాను. సైక్లింగ్ వినియోగం పెరగాలనేది నా లక్ష్యం. చాలా మంది బైక్ మీద వెళ్లు అని చెబుతుంటారు. కానీ సైకిల్ ఎందుకు వినియోగించాలి అనేది నేను వారికి వివరిస్తుంటాను. ఒకప్పుడు సైకిల్ మన తొలివాహనం. చాలా మంది తమ పని ఒత్తిడిలో పడి సైకిల్ తొక్కడం మరిచిపోయారు. ఏదో జిమ్లలో సైక్లింగ్ పరికరాలను తొక్కుతూ వ్యాయామం చేశామనుకుంటున్నారు. కానీ సైకిల్ కేవలం ఆరోగ్యానికే కాదు.. సమాజ శ్రేయస్సుకూ ఉపయోగపడుతుంది.
– ఉమా మహేశ్, బ్యాంకు ఉద్యోగి
చెట్టు విలువ తెలుసుకో
కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా ఆక్సిజన్ దొరకకపోతే ప్రాణాలు నిలబెట్టుకోలేం. చెట్లను పెంచడం, వాటి నరికివేతను ఆపడం, అడవుల కొట్టివేతను అరికట్టడం వల్ల గాలిలో సహజంగా ఆక్సిజన్ లభిస్తుంది. ఒక చెట్టు వయసును బట్టి ఒక ఏడాదికి దాని విలువ 74,500 అని సుప్రీం కోర్టు నియమించిన ఐదుగురు సభ్యుల ప్యానెల్ తమ నివేదికలో తెలిపింది. వంద సంవత్సరాల చెట్టు విలువ ఒక కోటి రూపాయలు కంటే ఎక్కువ ఉంటుంది. మానవ శరీరంలాగే చెట్టు విలువ చాలా విలువైనది. చెట్టును నరకడం అంటే దానిని చంపడమే. సైక్లింగ్ వినియోగం పెంచి మనవంతుగా పర్యావరణాన్ని రక్షించుకుందాం.- రుతుంబర, సైక్లిస్టు
సైక్లిస్టుల సంఖ్య పెరగాలి
నగరంలో సైక్లింగ్ చేయడానికి ప్రత్యేకమైన దారి ఏర్పాటు చేస్తే సైక్లిస్టుల సంఖ్య మరింత పెరగుతుంది. వాహనాలు వదిలి సైకిళ్లను ఆశ్రయిస్తారు. ప్రభుత్వానికి మేం విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్గారి దృష్టికి తీసుకు వెళ్లాలని అనుకుంటున్నాం. కార్యాలయాలకు కూడా మేం సైకిల్పైనే వెళుతున్నాం. ప్రతి ఒక్కరూ సైక్లింగ్లో కలిసి రావాలి. సైక్లిస్టులు రోడ్డు గుండా వెళుతున్న సమయంలో వాహనదారులు వారికి సహకరించాలి. – లక్ష్మీశ్రీ, సైక్లిస్టు