బంజారాహిల్స్, జనవరి 14: పాత ఆలోచనలను, ప్రతికూల ఆలోచనా విధానాన్ని మంటల్లో కాల్చివేసి సరికొత్త విధానంతో జీవితంలో ముందుకు వెళ్లేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. భారత జాగృతి ఆధ్వర్యంలో శనివారం బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్కువద్ద బోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున భోగిమంటలు వెలిగించి ఆటపాటలతో సందడి చేశారు.
తెలుగు సంస్కృతిలో భాగమైన గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు, కోలాటాల సందడితో కేబీఆర్ పార్కు ఆవరణలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ..తెలంగాణ జాగృతి ద్వారా తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పామని, బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు తర్వాత తెలంగాణ జాగృతిని భారత జాగృతిగా మార్చామన్నారు.
భారత జాగృతి మొట్టమొదటి కార్యక్రమాన్ని కేబీఆర్ పార్కువద్ద సంక్రాంతి సంబరాల్లో పాల్గోవడం సంతోషంగా ఉందన్నారు. హరిదాసులు, బసవన్నల దీవనలతో భారతదేశం సుభిక్షంగా వర్ధిల్లాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్, భారత జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్, భారత జాగృతి హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు అనంతుల ప్రశాంత్, మారిషస్ తెలుగు మహాసభ ప్రతినిధులు పాల్గొన్నారు.