ఖమ్మం, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ కాళేశ్వరం: భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం మళ్లీ పెరుగుతున్నది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురవడం.. ప్రాణహిత, ఇంద్రావతి నదుల నుంచి వరద పోటెత్తడంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మంగళవారం సాయంత్రం 5 గంటలకు 43.5 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేశారు.
రాత్రి 10 గంటలకు 47 అడుగులకు చేరుకున్నది. బుధవారం ఉదయానికి 55 అడుగులకు నీటిమట్టం పెరిగే అవకాశం ఉన్నదని భావిస్తున్నారు. దీంతో కలెక్టర్ అనుదీప్ వరద ప్రభావిత ప్రాంతాల అధికారులను అప్రమత్తం చేశారు. ప్రజలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం, బూర్గంపాడు, సారపాక, అశ్వారావుపేట, పినపాక, ఏడూళ్లబయ్యారం తదితర గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియను వేగవంతం చేశారు.
గోదావరి ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతున్నది. సోమవారం రాత్రి 10 గంటలకు 36 అడుగులున్న నీటిమట్టం మంగళవారం రాత్రి 10 గంటలకు 47 అడుగులకు చేరింది. నీటిమట్టం 55 అడుగులకు చేరుకుంటే భద్రాచలం నుంచి చర్ల, వెంకటాపురం వెళ్లే ప్రధాన రహదారిపై నీరు ప్రవహించనున్నది.
దీంతో ఆ ప్రాంతంలో రాకపోకలకు అంతరాయం కలగనున్నది. ఇప్పటికే భద్రాచలం నుంచి ఒడిశా, ఛత్తీస్గఢ్ వెళ్లే ప్రధాన రహదారులకు వరద నీరు చేరింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం పుష్కరఘాట్ వద్ద గోదావరి 11.55 మీటర్ల ఎత్తులో 7.21 లక్షల క్యూసెక్కుల ప్రవహిస్తున్నది.