ఆఫీసర్ ఫొటో అని బోల్తా పడకండి..
రెండోసారి ఐఏఎస్ అధికారి ఫొటోతో డబ్బులకు రిక్వెస్టు…
ట్విట్టర్లో ఫిర్యాదు చేసిన అర్వింద్ కుమార్…
సిటీబ్యూరో, మే 26(నమస్తే తెలంగాణ): పురపాలక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అర్వింద్కుమార్ ఫొటో డీపీతో మారోసారి సైబర్ నేరగాళ్లు డబ్బులను డిమాండ్ చేస్తూ వాట్సాప్ మెసేజ్లను పంపిస్తున్నారు. ఇది గుర్తించిన అర్వింద్ కుమార్ గురువారం ట్విట్టర్ ద్వారా తెలంగాణ డీజీపీ, హైదరాబాద్ పోలీసు కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. ఇలా వాట్సాప్లలో నేరగాళ్లు మెసేజ్లు పంపించి డబ్బులు అడగడం ఇది రెండోసారి. తాజాగా సీనియర్ ఐఏఎస్ అధికారి డీపీతో వాట్సాప్లో మెసేజ్ పంపిన తీరు ఇలా ఉంది… అర్వింద్కుమార్ డీపీ (డిస్ప్లే పిక్చర్) 7466905844 నంబరుతో .. జగన్కు వాట్సాప్ మెసేజ్ వచ్చింది. అందులో అర్వింద్ కుమార్ టైప్ చేసినట్లు… హలో జగన్… హౌ ఆర్ యూ.. డూయింగ్.. అని పంపించారు.
దీనికి జగన్ ఫైన్ సార్.. అంటూ రిైప్లె ఇచ్చాడు. జవాబుగా అరవింద్కుమార్ టైప్ చేసినట్లు వెరీ వెల్… దేర్ ఈజ్ సమ్థింగ్.. ఐ నీడ్ యూ టూ ప్లీజ్ డూ ఫర్ మీ అర్జెంట్లీ యాజ్ ఐ యామ్ కరంట్లీ అటెండింగ్ ఏ వెరీ క్రూషీయల్ మీ విత్ లిమిటెడ్ ఫోన్ కాల్స్ అంటూ తెలిపాడు. నకిలీ డీపీ ద్వారా జరిగిన ఈ సంభాషణను గుర్తించి ఐఏఎస్ అధికారి అర్వింద్కుమార్ విషయాన్ని ట్విట్టర్ ద్వారా డీజీపీ, నగర పోలీసు కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు.
అప్రమత్తంగా ఉండాలి..
ఐఏఎస్, పోలీసు అధికారులు, సెలబ్రిటీల నకిలీ డీపీలను సృష్టిస్తున్న నేరగాళ్లు సోషల్ మీడియా ద్వారా డబ్బులు అడుగుతున్నారని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. వీరిపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇది పక్కా సైబర్ నేరగాళ్ల పనేనని తెలిపారు. రాజస్థాన్ రాష్ట్రంలోని మేవాట్, అళ్వార్, భరత్పూర్ ప్రాంతాలకు చెందిన సైబర్ నేరగాళ్లు ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారని అనుమానిస్తున్నారు.