ఆర్కేపురం, మే 26 : సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం సద్వినియోగం చేసుకొని అభివృద్ధిని సాధించాలని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి సూచించారు. దళిత బంధు ప్రాజెక్ట్ మొదటి విడతలో ఎంపికైన 18 మందికి కార్లు, ట్రాక్టర్లను ఎమ్మెల్యే సుధీర్రెడ్డి, ఎమ్మెల్సీలు బొగ్గారపు దయానంద్గుప్త, ఎగ్గె మల్లేశం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మొదటి విడతగా 100 మందికి అందజేస్తున్నామని తెలిపారు.
త్వరలో మిగతా వారికి ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. వచ్చే బడ్జెట్లో నియోజకవర్గం పరిధిలో 1500 మందికి ఈ పథకాన్ని అమలు చేయనున్నట్టు చెప్పారు. ఈ పథకం ద్వారా దళితులు అభివృద్ధి చెందాలని సూచించారు. కార్యక్రమంలో హయత్నగర్ తాసీల్దార్ సుచరిత, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ప్రవీణ్రెడ్డి, నోడల్ అధికారి రాజేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.