మేడ్చల్ కలెక్టరేట్, ఫిబ్రవరి 20 : తమకు కేటాయించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను తమకే ఇవ్వాలని మంగళవారం కలెక్టరేట్లో లబ్ధిదారులు ఆందోళన చేశారు. పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలోని పర్వతాపూర్లో కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించింది. నగరంలో వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న పేదలకు డ్రా పద్ధతిన ఎంపిక చేసి, సర్టిఫికెట్లను అందజేశారు. అయితే స్థానికులు తమను కాదని స్థానికేతరులకు ఎలా కేటాయిస్తున్నారని కొంత కాలంగా పీర్జాదీగూడలో ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ ఆందోళనకు అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించకపోవడంతో మంగళవారం కలెక్టరేట్కు చేరుకున్నారు. తమకు ఇచ్చిన సర్టిఫికెట్లను చూపిస్తూ ఆందోళన చేశారు.
ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తమకు డబుల్ బెడ్రూంలను మంజూరు చేస్తూ ధ్రువీకరణ పత్రాలు కూడా అందజేశారన్నారు. తీరా అక్కడికి వెళ్తే ఎవరూ రానివ్వడం లేదన్నారు. ఈ విషయాన్ని పలుమార్లు అధికారులు దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదన్నారు. వెంటనే కలెక్టర్ స్పందించి తమకు కేటాయించిన డబుల్ బెడ్రూం ఇండ్లను తమకు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.