Crime News | హైదరాబాద్ : సికింద్రాబాద్ మోండా మార్కెట్ పరిధిలో దారుణం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి ఇద్దరు యాచకులపై గుర్తు తెలియని దుండగులు దాడులకు పాల్పడ్డారు. ఇందులో ఓ యాచకుడిని అత్యంత దారుణంగా గొంతు కోసి చంపారు. ఫుట్పాత్పై నిద్రిస్తున్న మరో యాచకుడిని సైతం హత్య చేసేందుకు యత్నించారు. యాచకుల వద్ద ఉన్న డబ్బును దుండగులు అపహరించారు.
యాచకుడు హత్యకు గురైన విషయాన్ని స్థానికులు గమనించి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. యాచకుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. గాయపడ్డ యాచకుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. యాచకులపై ముగ్గురు వ్యక్తులు కత్తులతో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.