సుల్తాన్బజార్, ఆగస్టు 25 : అక్రమ మార్గంలో సంపాదనకు అలవాటుపడి విలాసవంతమైన జీవితాన్ని గడిపేందుకు అమాయక ప్రజలను మోసం చేస్తున్న ఓ వ్యక్తిని బేగంబజార్ పోలీసులు అరెస్టు చేసి కటాకటాల్లోకి నెట్టారు. ఇన్స్పెక్టర్ నమిండ్ల శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం, ఎక్లాష్ఖాన్పేట్ తండాకు చెందిన బాణావత్ రామకృష్ణ(39) బతుకుదెరువు నిమిత్తం నగరానికి వచ్చి బోడుప్పల్, వీరారెడ్డినగర్లో నివాసం ఉంటూ కారు డ్రైవర్గా జీవనం గడుపుతున్నాడు. కాగా, రామకృష్ణ విలాసవంతమైన జీవనం గడపడానికి ‘శ్రీకృష్ణ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ’ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసి అంగవైకల్యం ఉన్న వారితో భిక్షాటన చేయిస్తూ సామాన్య ప్రజలను మోసం చేస్తూ విలాసవంతమైన జీవనాన్ని గడుపుతున్నాడు.
విశ్వసనీయ సమాచారం మేరకు కమిషనర్ టాస్క్ఫోర్స్ సెంట్రల్ జోన్ ఇన్స్పెక్టర్ బి.రాజు నాయక్, ఎస్ఐ సీహెచ్.నవీన్కుమార్ బృందంతో కలిసి దాడి చేసి రామకృష్ణను అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ విచారణలో అంగవైకల్యం ఉన్న వారితో స్వచ్ఛంద సంస్థ పేరుతో భిక్షాటన చేయిస్తున్నట్లు గుర్తించి అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. బెగ్గింగ్ మాఫియాను కనిపెట్టి మాఫియాకు పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులను ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు.