బంజారాహిల్స్,అక్టోబర్ 12 : ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో..’ పాటలతో మంగళవారం సాయంత్రం నిమ్స్మే గ్రౌండ్ మారుమోగింది. మహిళలు ఆట, పాటలతో సందడి చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహ్మత్నగర్ డివిజన్లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబురాల్లో సుమారు 4 వేలమంది మహిళలు పాల్గొని ఆడిపాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ.. ఒక్కో డివిజన్లో సుమారు 4నుంచి 5వేల మంది మహిళలు ప్రతిరోజూ బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటారని తెలిపారు. బతుకమ్మ వేడుకల్లో పాల్గొనే మహిళలకు తనవంతుగా బహుమతులు పంపిణీ చేస్తామన్నారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సీఎన్.రెడ్డి, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు మన్సూర్, ప్రధాన కార్యదర్శి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.