సిటీబ్యూరో, అక్టోబర్ 21(నమస్తే తెలంగాణ): తెలంగాణ సంస్కృతికి నిదర్శనమైన సద్దుల బతుకమ్మ వేడుకలు హైదరాబాద్ వేదికపై ఆదివారం అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ప్రధానంగా ట్యాంక్బండ్ కేంద్రంగా బతుకమ్మ సంబురాలు ఇంద్రధనుస్సు వర్ణాలలో అత్యంత మనోహరంగా జరగనున్నాయి. ‘శ్రీలక్ష్మి నీ మహిమలూ.. గౌరమ్మ చిత్రమై తోచునమ్మా…, ఒక్కేసి పువ్వేసి చందమామ.. ఒక్కజాము ఆయె చందమామ, ఇంకా ఉయ్యాల.. ఉయ్యాల ఉయ్యాలో’ లాంటి పాటలతో నగరం హోరెత్తనుంది. విభిన్న రకాల పాటలతో బతుకమ్మల చుట్టు మహిళలు చప్పట్లతో కోలాటమేస్తూ బతుకమ్మల చుట్టూరా తిరుగుతూ ఆడి పాడుతారు.
మరికొంత మంది మహిళలు కోలాటం, ఉయ్యాలూగుతూ సందడి చేస్తారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరు బతుకమ్మ సంబురాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. నగరమంతా పూలు పరుచుకున్నాయా..! అన్నట్టు దర్శనమివ్వనున్నాయి నేడు నగర వీధులు. బతుకమ్మలో భాగంగా ఆదివారం మధ్యాహ్నం నుంచి రాత్రి 11 గంటల వరకు ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాలన్నీ బతుకమ్మకు వేదికలుగా మారునున్నాయి. నగరంలో ఎక్కడికక్కడ బతుకమ్మ ఆడుకునేందుకు అధికారులు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. డీజేలు, లైవ్ మ్యూజిక్లతో బతుకమ్మ కేంద్రాలు సందడి తలపించనున్నాయి.