బతుకమ్మ, బోనాల పండుగలు రెండూ ఒకేసారి వచ్చినట్లుగా.. ఊరూరా చెరువుల పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన చెరువుల పండుగలో మహిళలు బతుకమ్మలు, బోనాలతో తరలివచ్చారు. మహిళల చప్పట్లకు తోడు పోతురాజుల విన్యాసాలు.. పటాకుల చప్పుళ్లు.. ఒగ్గుకళాకారుల ఆటపాటలు.. మొత్తంగా సెరువంత సంబురమయింది. మండుటెండల్లో మత్తడులు దుంకుతున్న చెరువులను చూసి హృదయాలు ఉప్పొంగాయి. కాకతీయుల స్ఫూర్తితో సీఎం కేసీఆర్ చేపట్టిన మిషన్ కాకతీయ ఫలాలను చూసి ప్రతి ఒక్కరూ పండుగ చేసుకున్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొని గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు.
సిటీబ్యూరో, జూన్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గొలుసుకట్టు చెరువులు నిండితే.. గుండె నిండినంత సంబురం.. రాష్ట్రం ఏర్పడక మునుపు చెరువులు ఎండేవి. ప్రస్తుతం ఎండాకాలంలోనూ చెరువులు నిండుకుండల్లాగ తొనికిసలాడుతున్నవి. అపరభగీరథుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వర జలాలను తెలంగాణ నడిగడ్డకు తీసుకొచ్చి నిండుకుండలను తలపించేలా ఊర చెరువులను నింపిన ఘనత ఆయనది. ప్రజానికానికి జీవనాడులుగా ఉన్న చెరువులకు కాళేశ్వర జలాలతో నింపి ఆదరువుగా నిలిచిన సీఎం కేసీఆర్కు జేజేలు పలుకుతున్నారు.
తెలంగాణ సంస్కృతికి నిలువుటద్దమైన బతుకమ్మలతో తెలంగాణ ఆడపడుచులు చెరువు కట్టల వద్ద నిర్వహించిన సంబురాలకు తరలివెళ్లారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాల సందర్భంగా గ్రేటర్లో ‘ఊరూరా చెరువుల పండుగ’ అత్యంత వైభవంగా నిర్వహించారు. చెరువు కట్టల వద్ద బతుకమ్మలతో మహిళలు తరలివచ్చి ఉత్సవాలకు తరలివచ్చారు. పలు చెరువల వద్ద ఏర్పాటు చేసిన వేడుకలకు మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు, శివారు మున్సిపాల్టీల మేయర్లు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.