హైదరాబాద్ : ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగర వ్యాప్తంగా బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు నగర వ్యాప్తంగా 263 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశారు. కొత్తగా మరో 37 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో 20 దవాఖానాలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో వార్డుకు 2 చొప్పున 300 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే.
బస్తీ దవాఖానలో ఓపీ, ప్రాథమిక రోగ నిర్ధారణ పరీక్షలు, గర్భిణీలు, బాలింతలకు పరీక్షలు, టీకాలు వేయడం, రక్తహీనత, కుటుంబ నియంత్రణ పరీక్షలు, బీపీ, షుగర్, క్యాన్సర్ పరీక్షలు, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన, చైతన్య వంటి కార్యక్రమాలతో పాటు, ఇతర ప్రాథమిక చికిత్సలు, అంతకు మించి అత్యవసర ఆరోగ్య సమస్యలకు రిఫరెల్ ప్రభుత్వ హాస్పిటల్కు పంపించి మెరుగైన చికిత్స అందించేందుకు కృషి చేస్తున్నారు.