సిటీ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని ఎలాంటి అవాంతరాలు లేకుండా అందించేందుకు జలమండలి చేపట్టిన బస్తీబాట అట్టర్ ఫ్లాప్ అవుతున్నది. ఎండలు తీవ్రమైన నేపథ్యంలో ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించడంలో అధికారులు ఘోరంగా విఫలమవుతున్నారు. జలమండలి పరిధిలో నిత్యం ఎక్కడో ఒకచోట ప్రజలు నీటి కోసం రోడ్డెక్కుతున్నారు. సరఫరా నిలిచిపోవడం, లోప్రెషర్, కలుషితనీరు సరఫరా కావడం వంటి సమస్యలతో సతమతమవుతున్నారు.
బిందెలు పట్టుకుని పలు కాలనీల ప్రజలు జలమండలి రిజర్వాయర్లను ముట్టడిస్తున్నారు. కలుషిత నీటిని పట్టుకుని జలమండలి ప్రధాన కార్యాలయానికి క్యూ కడుతున్నారు. ఒకవైపు అధికారులు ప్రతిరోజు ఉదయమే క్షేత్రస్థాయిలో పర్యటించి వినియోగదారుల సమస్యలను తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరించాలనే ప్రధాన ఉద్దేశంతో బస్తీబాట కార్యక్రమాన్ని చేపట్టారు. అది కాస్తా ఆరంభ శూరత్వంగా మారింది.
నీటి సమస్యలు లేనప్పుడు కాలనీల్లో తెగ తిరిగిన అధికారులు.. ఎండల తీవ్రత పెరిగిపోయి… సరిగ్గా సరఫరా కాకపోవడంతో జనం రోడ్డెక్కుతుంటే మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బస్తీ బాట పేరుకే చేపడుతున్నారని.. ఎక్కడా తాగునీటి సమస్యను మాత్రం పరిష్కరించడం లేదని నగర ప్రజలు ఆరోపిస్తున్నారు. రోజుకో ప్రాంతంలో నీటి ఎద్దడితో జలమండలి వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నా.. అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడటంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.