Bansilalpet Metla Bavi | శతాబ్దాల చరిత్ర ఉన్న మెట్ల బావులు మన సంస్కృతిలో భాగం. అయితే దశాబ్దాలుగా నిరాదరణకు గురై..రూపురేఖలు కోల్పోయిన వీటి పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నది తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్ చారిత్రక వైభవానికి సజీవ సాక్ష్యాలుగా నిలిచే మెట్ల బావుల పరిరక్షణకు ప్రణాళికాబద్ధంగా కార్యాచరణ చేపట్టి.. ‘బావి’తరాలకు అందించేందుకు నడుం బిగించింది. ఇందులోభాగంగానే బల్దియా, హెచ్ఎండీఏ ప్రత్యేక చొరవతో బన్సీలాల్పేట మెట్ల బావి మళ్లీ జీవం పోసుకుంది.
నాటి వైభవాన్ని కళ్లకు కట్టేలా పునరుద్ధరించిన మెట్ల బావిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. సహిత స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఈ బావిని జీహెచ్ఎంసీ పునరుద్ధరించింది. పురాతన బావికి మరమ్మతులు చేసి ఆధునీకరించారు. దీంతో మెట్ల బావి కొత్త అందాలు సంతరించుకుంది.
చెత్తాచెదారంతో పూడుకుపోయిన ఈ బావి పునరుద్ధరణ పనులను 2021 ఆగస్టు 15న ప్రారంభించారు. సుమారు 500 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తొలగించారు. కండ్లు చెదిరేలా పర్యాటక హంగులు కల్పించారు. విద్యుద్దీపాలు అలంకరించి.. ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు వీలుగా అంపీ థియేటర్, పూడికతీత తొలగింపు సందర్భంగా లభ్యమైన వివిధ రకాల పరికరాల ప్రదర్శన కోసం గ్యాలరీ, చక్కటి పచ్చదనంతో కూడిన గార్డెన్ను ఏర్పాటు చేశారు.
సికింద్రాబాద్ ప్రజల తాగునీటి కోసం బన్సీలాల్పేటలోని మెట్ల బావిని అసఫ్-జాహీ వంశస్తులు ఆరు అంతస్తుల లోతు, మెట్లు, స్తంభాలతో అద్భుతంగా నిర్మాణం చేశారు. ఊటనీరుతో నిండి మోట ద్వారా నీటిని పైకి లాగడానికి ఏర్పాట్లు కూడా ఉండేవి. ఆంగ్లేయుల కాలంలో సికింద్రాబాద్ పాలనాధికారి, రెసిడెంట్ అధ్యక్షుడు టీహెచ్ కీస్ ఈ బావిని 1933లో పునరుద్ధరించారు. అందుకు సేట్ బన్సీలాల్ అనే వ్యాపారి ఆర్థిక సహకారం అందించారని, అనంతరమే ఆ ప్రాంతానికి బన్సీలాల్పేట్ అని నిలిచిపోయింది.
నిజాం రాజులు తాగునీటి కోసం కట్టించిన బన్సీలాల్పేట మెట్ల బావి రాష్ట్ర ప్రభుత్వం, రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ చొరవతో పునర్జీవం పోసుకున్నది. ఈ బావి సామర్థ్యం 22లక్షల లీటర్లు. నీళ్లు ఎంత కిందికి వెళ్లినా.. మెట్ల ద్వారా కిందకు దిగి.. కుండ లేదా బిందెతో మంచి నీళ్లు తోడుకోవచ్చు. అయితే కాలక్రమేణా చెత్తా చెదారం నిండిపోయింది. ఈ బావి పునరుద్ధరణ పనులను 2021 ఆగస్టులో ప్రారంభించారు. దాదాపు 5 వందల మెట్రిక్ టన్నుల మట్టి, చెత్తను తొలగించారు. మట్టి తీస్తున్న కొద్దీ పురాతన వస్తువులు బయట పడ్డాయి. ఉపరితలం నుంచి 50 ఫీట్ల లోతు వరకు ఉన్న బావి లోపలి నుంచే ఓ నిరంతర నీటి ఊట ఉంది. ఇది 55 ఫీట్ల కింద నుంచే వస్తున్నట్టు గుర్తించారు. ప్రతి రోజు తెల్లారేసరికల్లా కనీసం 6 ఫీట్ల నీరు ఆ బావిలో చేరుతోందని రెయిన్ వాటర్ ప్రాజెక్టు ఫౌండర్ కల్పన రమేశ్ చెప్పారు. ప్రస్తుతం 53 అడుగుల మేర ఊట నీరుతో మెట్లబావి కళకళలాడుతున్నది. బావి చుట్టు పక్కల ప్రాంతాలలో బోర్లన్నీ భూగర్భ జలాలతో నిండుగా ఉన్నాయని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.