సిటీబ్యూరో, జనవరి 14 (నమస్తే తెలంగాణ): నకిలీ ఆధార్కార్డు, పాన్ కార్డులతో బ్యాంకు ఖాతాలు తెరిచి.. వాటిని సైబర్ చీటర్స్కు అందజేస్తున్న ఇద్దరు సైబర్ నేరగాళ్లను సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. జాయింట్ సీపీ ఏవీ రంగనాథ్ కథనం ప్రకారం.. హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్కు చెందిన హిమాన్షు, ప్రవీణ్.. ఢిల్లీకి చెందిన సైబర్నేరగాడు దేవేందర్ పంఛాల్తో చేతులు కలిపారు. దేశ వ్యాప్తంగా అమాయకులను మోసం చేయడం ఒక ఎత్తయితే, మోసం చేసిన డబ్బులను బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం మరోఎత్తు. ఈ తతంగంలో సైబర్నేరగాళ్లకు బినామీ పేర్లతో బ్యాంకు ఖాతాలు అవసరం ఉంటాయి. ఈ బ్యాంకు ఖాతాలను తెరిచే బాధ్యతలను హిమాన్షు, ప్రవీణ్ తీసుకున్నారు. ఫేక్ ఆధార్ కార్డు, పాన్ కార్డులు తయారీ చేసి.. వివిధ బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి దేవేందర్ పంఛాల్కు అందిస్తుంటారు. ఇదిలాఉండగా.. అమీర్పేటకు చెందిన బాధితురాలికి ఫోన్చేసి పార్ట్టైమ్ జాబ్ ఇస్తామంటూ సైబర్నేరగాళ్లు నమ్మించారు. పార్ట్టైమ్ జాబ్ పేరుతో నమ్మించి.. ఆ తరువాత పెట్టుబడులు పెట్టిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఇందులో భాగంగా బాధితురాలికి ఫోన్చేసి రూ.4.75 లక్షలు మోసం చేశారు. సైబర్నేరగాళ్ల మోసంపై సీసీఎస్ సైబర్క్రైమ్లో బాధితురాలు ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసి, ఇన్స్పెక్టర్ ప్రసాద్రావు నేతృత్వంలోని బృందం దర్యాప్తు చేపట్టింది. దర్యాప్తులో ఢిల్లీ నుంచి మోసం జరిగినట్లు గుర్తించారు. బ్యాంకు ఖాతాలను పరిశీలించడంతో.. అవి నకిలీ ఆధార్, పాన్ కార్డు సహాయంతో హిమాన్షు, ప్రవీణ్ తెరిచినట్లు గుర్తించి, ఇద్దరిని అరెస్టు చేశారు. సైబర్ మోసానికి పాల్పడిన దేవేందర్ పంఛాల్ పరారీలో ఉన్నాడు.