Banjarahills | బంజారాహిల్స్, మే 20 : ఖరీదైన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించేందుకు యత్నిస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ షేక్పేట మండల తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. షేక్పేట మండలం సర్వే నెంబర్ 403/పి, టీఎస్ నెంబర్ 17, బ్లాక్-డి, వార్డ్-10లో బంజారాహిల్స్ రోడ్ నెం 14లోని సుమారు ఎకరం ప్రభుత్వ స్థలాన్ని బోగస్ పత్రాలతో కబ్జా చేసేందుకు అబ్దుల్ ఖాలీద్ అనే వ్యక్తి గత కొన్నేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో అతడిపై 2020లో బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదయింది. ఈ క్రమంలో సోమవారం రాత్రి అబ్దుల్ ఖాలీద్ పేరుతో ప్రభుత్వ స్థలం బయట పోస్టర్లు వెలిశాయి. స్థలంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ హెచ్చరిక బోర్డులను దుండగులు తొలగించారు. ఈ మేరకు సమాచారం అందుకున్న షేక్పేట రెవెన్యూ సిబ్బంది అక్కడకు చేరుకుని అబ్దుల్ ఖాలీద్ పేరుతో ఏర్పాటు చేసిన పోస్టర్లను తొలగించారు.
ఈ మేరకు నిందితుడు అబ్దుల్ ఖాలీద్ మీద చర్యలు తీసుకోవాలంటూ షేక్పేట మండల తహసీల్దార్ అనితారెడ్డి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా బీఎన్ఎస్329(3), 324(4) సెక్షన్లతో పాటు పీడీపీపీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ స్థలం వ్యవహారంలో గతంలో షేక్పేట తహసీల్దార్ సుజాతతో పాటు ఒక ఆర్ఐతో పాటు బంజారాహిల్స్ ఎస్ఐ రవీందర్ ఏసీబీకి పట్టుబడ్డ విషయం తెలిసిందే. అవమానభారంతో తహసీల్దార్ సుజాత భర్త ఆత్మహత్య చేసుకోవడం, సుజాత కూడా కొన్నాళ్ల తర్వాత అనారోగ్యంతో మృతి చెందారు. కాగా ఆ సమయంలో పోలీసుల విచారణలో అబ్దుల్ ఖాలీద్ పత్రాలు బోగస్వి అని తేలడంతో సీసీఎస్లో సైతం అతడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. తాజాగా బంజారాహిల్స్ రోడ్ నెం 14లోని ప్రభుత్వ స్థలంపై మరోసారి అబ్దుల్ ఖాలీద్ కన్నేయడంతో అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు.