హైదరాబాద్ : బల్కంపేట ఎల్లమ్మ తల్లి కల్యాణాన్ని కన్నుల పండువగా.. అత్యంత వైభవంగా నిర్వహిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ఈనెల 5 వ తేదీన జరిగే బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం, 6 వ తేదీన జరిగే రథోత్సవం ఏర్పాట్లను మంత్రి ఆదివారం వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అమ్మవారి కల్యాణాన్ని ఎంతో ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
అమ్మవారి కల్యాణానికి వచ్చే లక్షలాది మంది భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలిపారు.
దర్శనం సమయంలో ఎలాంటి తోపులాట లేకుండా ఉండేందుకు పటిష్టమైన భారీ కేడ్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అమ్మవారి కల్యాణాన్ని తిలకించేలా ఎల్ఈడీ స్క్రీన్ లను ఏర్పాటు చేయడంతో పాటు లైవ్ టెలికాస్ట్ ద్వారా కూడా ప్రజలు అమ్మవారి కల్యాణాన్ని చూసే విధంగా ఏర్పాట్లు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.
భక్తులు అమ్మవారికి కానుకల రూపంలో సమర్పించిన బంగారంతో కోటి రూపాయల విలువ కలిగిన బంగారు చీర, ఆభరణాలు చేయించి అమ్మవారికి అలంకరిస్తున్నట్లు తెలిపారు. నిత్యం అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని సౌకర్యాలు, వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు.
కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రవికిరణ్, మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ, ఈవో అన్నపూర్ణ, ఆలయ ట్రస్టీ సాయి బాబా గౌడ్, ఆలయ కమిటీ సభ్యులు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకట్, వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్, ఎస్ఆర్ నగర్ ఇన్ స్పెక్టర్ సైదులు, వాటర్ వర్క్స్ జీఎం హరి శంకర్,రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.