సిటీబ్యూరో, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రగతికి హైదరాబాద్ మహానగరం గుండెలాంటింది. కేసీఆర్ ప్రభుత్వం ఎస్ఆర్డీపీ, ఎస్ఎన్డీపీ, మెట్రోలతో పాటు ఐకానిక్ కట్టడాలు, అభివృద్ధి, సంక్షేమంలో హైదరాబాద్కు అంతర్జాతీయ గుర్తింపును తెచ్చింది. మెరుగైన జీవన ప్రమాణాలు కలిగిన నగరంగా వరుసగా ఐదుసార్లు దక్కించుకున్నది. ఇటువంటి మహానగరంలో ప్రగతి ప్రస్థానం ఆగకూడదంటే కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ అభివృద్ధికి బడ్జెట్లో పట్టం కట్టాలి.
ప్రస్తుత ప్రాజెక్టులతో పాటు మరిన్ని అభివృద్ధి పనులకు జీహెచ్ఎంసీ, జలమండలి, హెచ్ఎండీఏ, వైద్య ఆరోగ్య శాఖలు సమర్పించిన బడ్జెట్ ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకొని సీఎం రేవంత్రెడ్డి సర్కారు నిధుల వరద కురిపించాల్సి ఉంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో 2024-25 ఆర్థిక బడ్జెట్ను ప్రవేశపెడుతున్న రేవంత్రెడ్డి ప్రభుత్వం మహానగరంపై కరుణ చూపుతుందా? గ్రేటర్కు నిధులు కేటాయిస్తుందా? అన్నది గ్రేటర్ ప్రజానీకం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. ఇప్పటికే బల్దియా రూ.3500కోట్లు, జలమండలి రూ.4వేల కోట్లతో సర్కారు ముందు ప్రతిపాదనలు సమర్పించింది. ఆర్థిక సుడిగుండంలో చిక్కుకున్న ఈ ఇరు శాఖలు ఈ బడ్జెట్పై భారీగా ఆశలు పెట్టుకున్నాయి.
జీహెచ్ఎంసీ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ప్రస్తుతం రూ.6,530 కోట్లు కాగా.. ఇందులో ఇప్పటికే రూ.6,314 కోట్లు ఖర్చు చేశారు. మున్సిపల్ బాండ్లు, రూపీ టర్మ్ రూపంలో పలు దఫాలుగా తీసుకున్న మెజార్టీ రుణానికి ప్రస్తుతం వడ్డీ మాత్రమే చెల్లిస్తుండగా.. ఏప్రిల్ నుంచి అసలు, వడ్డీ కలిపి వాయిదాలు చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం సగటున నెలకు రూ.68 కోట్లు చెల్లిస్తుండగా, 2024-25 ఆర్థిక సంవత్సరానికి సుమారు రూ.105కోట్లకు చేరనున్నది. మూడు రోజుల క్రితం హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగింది. వాస్తవంగా బల్దియా ఇప్పటికే ప్రతి నెల వేతనాలు, పింఛన్లకు రూ.130కోట్లు, చెత్త తరలింపు, నిర్వహణకు సంబంధించి టిప్పింగ్ ఫీ కింద సుమారు రూ.40కోట్లు, వీధి దీపాల నిర్వహణ రూ.7కోట్లు, రోడ్ల నిర్మాణం, నిర్వహణ, ఇతర పనులకు రూ.100కోట్లు ఖర్చు చేస్తున్నది.
ఆదాయానికి, ఖర్చుకు దాదాపు ఏటా 900కోట్ల మేర లోటు బడ్జెట్ ఉంటుంది. ముఖ్యంగా రూ.1000కోట్ల మేర పెండింగ్ బిల్లులు కాంట్రాక్టర్లకు చెల్లించాల్సి ఉంది. ఈ పెండింగ్ బిల్లులు చెల్లించే వరకు అభివృద్ధి పనులు చేపట్టబోమని ఇప్పటికే జీహెచ్ఎంసీకి కాంట్రాక్టర్లు అల్టిమేటం జారీ చేసి రోజుకో రీతిలో నిరసన తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే రెండో దశ ఎస్ఆర్డీపీ, ఎస్ఎన్డీపీ, సీఆర్ఎంపీ పనులకు, మూసీ సుందరీకరణకు దాదాపు రూ.3500కోట్ల నిధులు అవసరమని జీహెచ్ఎంసీ ప్రభుత్వానికి బడ్జెట్ ప్రతిపాదన సమర్పించింది.
ప్రభుత్వం ఏ మేర జీహెచ్ఎంసీని ఆదుకుంటున్నదో వేచి చూడాల్సిందే.
జలమండలికి కావాల్సింది రూ.4వేల కోట్లు 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.4వేల కోట్ల నిధులు కావాలని జలమండలి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. గోదావరి, కృష్ణా ఫేజ్లకు చేసిన రుణాలు, వార్షిక వడ్డీలకు రూ.వెయ్యి కోట్లు, మురుగునీటి శుద్ధి కేంద్రాలకు రూ.1500కోట్లు, ఔటర్ రింగు రోడ్డు ఫేజ్-2 ప్రాజెక్టు కింద చేపడుతున్న పనులకు, ఉచిత తాగునీటి పథకానికి రూ.500కోట్లు కేటాయించాలని కోరారు.