జీహెచ్ఎంసీవ్యాప్తంగా ఓటరు జాబితా తయారీలో నిమగ్నమైంది బల్దియా. ఇందులోభాగంగానే శనివారం, ఆదివారం బూత్ లెవల్ అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు. మరో విడతలో సెప్టెంబర్ 2,3 తేదీల్లో క్యాంపెయిన్ నిర్వహించనున్నారు. శిక్షణలో పాల్గొనని వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని నియోజకవర్గం ఈఆర్వోలను కమిషనర్ ఆదేశించారు.
సిటీబ్యూరో, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ) : పటిష్టమైన ఓటరు జాబితా తయారీలో భాగంగా ఈ నెల 26, 27 తేదీల్లో, వచ్చే నెల 2, 3 తేదీల్లో ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహించనున్నట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్పెషల్ సమ్మరీ రివిజన్ కార్యక్రమంలో భాగంగా 18 సంవత్సరాలు నిండిన వారందరూ, జాబితాలో పేరు నమోదు కానీ వారు, 1 అక్టోబర్ 2023 నాటికి 18 సంవత్సరాలు నిండబోయే వారు కూడా ఓటరు నమోదుకు అర్హులని కమిషనర్ పేర్కొన్నారు. ఈ ప్రత్యేక క్యాంపెయిన్ సందర్భంగా ఇటీవల విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితా మీ సమీపంలోని పోలింగ్ బూత్లో బీఎల్వో వద్ద ఉంటుందని, జాబితాలో మీ పేరు ఉందో లేదో, ఉన్నా ఏమైనా తప్పులు ఉన్నా..అక్కడికక్కడే పరిష్కరించుకోవచ్చని జిల్లా ఎన్నికల అధికారి పేర్కొన్నారు.
నూతన ఓటరు నమోదు, ఫారం-6తో ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులకు ఫారం-8, ఆన్లైన్ అయితే దగ్గరలో ఉన్న పోలింగ్ బూత్ల వద్ద బూత్ లెవల్ అధికారి శని, ఆది వారాల్లో, వచ్చే నెల 2, 3 తేదీల్లో నిర్వహించే ప్రత్యేక క్యాంపెయిన్లో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఆన్లైన్లో WWW.VOTERS.ECI.GOV.INలో VOTER HELPLINE మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఫారం-6ను నింపి నూతన ఓటరుగా నమోదు, ఫారం-8 ద్వారా ఓటరు జాబితాలో సవరణలు చేసుకోవచ్చన్నారు. వారి వారి పోలింగ్ స్టేషన్ల దగ్గర ప్రత్యేక క్యాంపెయిన్లో బీఎల్వోలు తప్పనిసరిగా హాజరై అవసరమైన ఫారాలు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. బూత్ స్థాయి అధికారి హాజరు కానీ పక్షంలో తీవ్రమైన క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలని నియోజకవర్గం ఈఆర్వోలను కమిషనర్ రోనాల్డ్ రోస్ ఆదేశించారు. పూర్తి వివరాలకు, ఇతర సందేహాలకు ఎన్నికల సంఘం టోల్ ఫ్రీ నంబర్ 1950 ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంప్రదించవచ్చన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని రోనాల్డ్ రోస్ సూచించారు.