సిటీబ్యూరో, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ) : కేబీఆర్ పార్కు అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కేబీఆర్ పార్కును సందర్శించి పార్కు మొత్తాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ వాకర్స్తో కలియతిరిగి కావాల్సిన సౌకర్యాలు, వసతులను అడిగి తెలుసుకున్నారు. వాకర్స్ సూచించిన విధంగా పనులను వెంటనే చేపట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కమిషనర్ ఆదేశించారు.
వాకింగ్ ట్రాక్ మరమ్మతులు, మురుగునీరు రాకుండా చేయాలని, వర్షపు నీరు బయటికి పోకుండా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని అంతేకాకుండా గ్రీనరీ, ఇతరత్ర వేస్ట్ను వేర్వేరు చేసి కంపోస్ట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని యూబీడీ, ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. పార్కులో అవసరమైన స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కమిషనర్ వెంట ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ వెంకటేశ్ దొత్రే, యూబీడీ అదనపు కమిషనర్ కృష్ణ, డైరెక్టర్ శ్రీనివాస్, డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.