ఖైరతాబాద్, ఏప్రిల్ 12 : బలగం మొగిలయ్య నిమ్స్ దవాఖానలో వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప పర్యవేక్షణలో వైద్యుల బృందం వైద్య సేవలందిస్తున్నది. మంగళవారం చాతిలో నొప్పి రావడంతో హైదరాబాద్లోని నిమ్స్కు తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఎలాంటి గుండె సమస్యలు లేవని చెప్పారు. మొగిలయ్య ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు వెంటనే మెరుగైన చికిత్స అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. కాగా, బుధవారం మంత్రి ఓఎస్డీ శ్రీనివాస్ రావు మొగిలయ్యకు అందుతున్న వైద్య సేవలపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
కిడ్నీలు పాడయ్యాయి..
గత 30 సంవత్సరాలుగా మొగిలయ్య మధుమేహం, రక్తపోటు సమస్యతో బాధపడుతున్నాడు. రెండు కిడ్నీలు పాడయ్యాయి. ఏడాది కాలంగా డయాలసిస్ చేయించుకుంటున్నారు. చాతిలో నొప్పి రావడంతో ఆయన గుండెకు సంబంధించిన అన్ని పరీక్షలు నిర్వహించాం. ఈసీజీ, టూడి ఈకోలు పూర్తిగా నార్మల్గా ఉన్నాయి.. దీర్ఘకాలంగా మధుమేహం ఉండటంతో కంటి చూపు మందగించింది. కంటి వైద్య నిపుణులను సైతం రప్పించి పరీక్షలు చేయిస్తున్నాం.
–డాక్టర్ బీరప్ప, నిమ్స్ డైరెక్టర్
మంత్రి హరీశ్ రావుకు రుణపడి ఉంటాం
నా భర్త చాలా రోజులుగా షుగర్, బీపీతో బాధపడుతున్నాడు. గత సంవత్సరం రెండు కిడ్నీలు చెడిపోగా, వారానికి మూడు రోజులు డయాలసిస్ చేయిస్తున్నాం. నా భర్త ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న మంత్రి హరీశ్ రావు చొరవ తీసుకొని మంచి వైద్యం ఇప్పిస్తున్నారు. డయాలసిస్ కోసం దుగ్గొండి నుంచి వరంగల్కు వెళ్లేందుకు స్వయంగా అంబులెన్స్ను ఏర్పాటు చేయించారు. మాకు వైద్య సాయం చేసిన మంత్రి హరీశ్ రావుకు రుణపడి ఉంటాం. వరంగల్లో కూడా మంత్రి ఎర్రబెల్లి దయాకర్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఎంతో చొరవ తీసుకున్నారు. వారికి కృతజ్ఞతలు.
–మొగిలయ్య భార్య కొమురమ్మ