సిటీబ్యూరో, జనవరి 5 (నమస్తే తెలంగాణ): నేరాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ కట్టడి చేస్తాం. అనుకోకుండా నేరం జరిగినా.. కేసును 24 గంటల్లోనే ఛేదించి నిందితులను పట్టుకునే లక్ష్యంగా ముందుకెళ్తాం.. అని రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ తెలిపారు. సామాన్య ప్రజలకు, చట్టాన్ని గౌరవించే వారితో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుందన్నారు. చట్టాన్ని అతిక్రమించే వారిపట్ల కఠినంగా ఉంటామని వెల్లడించారు. ప్రజలతో మర్యాదగా మెలగాలని సిబ్బందికి సూచించారు. రాచకొండ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన మొదటి సారిగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాను గతంలో అల్వాల్ డీసీపీగా, సైబరాబాద్ జాయింట్ కమిషనర్గా పనిచేశానని, ఇప్పుడు అదే ప్రాంతానికి కమిషనర్గా రావడం ఆనందంగా ఉన్నదని తెలిపారు. తనపై ప్రభుత్వం ఉంచిన బాధ్యతను నిర్వర్తిస్తూ ప్రజలకు మెరుగైన సేవలందిస్తామన్నారు. ఎక్కడైతే శాంతి భద్రతలు బాగుంటాయో.. అక్కడ అభివృద్ధి వేగంగా జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే సీఎం కేసీఆర్ పోలీస్ శాఖకు దిశా నిర్ధేశం చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
రాష్ట్రంలో పటిష్టమైన శాంతిభద్రతలు ఉండటంతో అభివృద్ధి వేగంగా జరుగుతూ సామాన్య ప్రజలకు ఫలాలు అందుతున్నాయని చెప్పారు. గత సీపీ మహేశ్ భగవత్ పటిష్టమైన వ్యవస్థను, టీమ్ను ఏర్పాటు చేశారంటూ.. ఆయన బాటలోనే నడుస్తామని తెలిపారు. ప్రజల గుండెల్లో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ భావన ఉండేలా మెరుగైన పోలీసింగ్ అందిస్తామన్నారు. హైదరాబాద్ దేశంలోనే అత్యంత సురక్షితమైన నగరమన్నారు. కొత్త చాలెంజ్లు వస్తున్నాయన్నారు. వాటిని అధిగమించేందుకు ఇప్పటికే సిద్ధమయ్యామన్నారు. రోడ్డు ప్రమాదాలను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కమిషనరేట్ పరిధిలో 23 లక్షల వాహనాలు ఉన్నాయని తెలిపారు. పాదచారులకు అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. సిగ్నల్స్ వద్ద రెడ్ లైట్ పడ్డా కొన్ని వాహనాలు ముందుకెళ్లి ప్రమాదానికి కారణమవుతున్నాయని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటాను.. ప్రజల సేవ కోసమే ఉన్నామన్నారు. పలు అంశాలపై సీపీ ప్రత్యేకంగా మాట్లాడారు.
నేర నివారణ
నేరాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. నేరం జరిగే ప్రాంతాలను గుర్తించి.. ఆ ప్రాంతంలో నేరం జరిగేందుకు అవకాశం ఉన్న అంశాన్ని గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు. కీసర, ఘట్కేసర్ వంటి ప్రాంతాల్లో పట్టణీకరణ పెరిగి గేటెడ్ కమ్యూనిటీలు వస్తున్నాయని తెలిపారు. రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ సహకారంతో నేరాలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
సీసీ కెమెరాలు..
గేటెడ్ కమ్యూనిటీలు, అపార్టుమెంట్లు, వాణిజ్య ప్రాంతాలు సెక్యూరిటీతో పాటు సీసీ కెమెరాలను తప్పని సరిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కనీసం రెండు కెమెరాలైనా ఉండాలన్నారు. నేరం జరగకుండా ఉండేందుకు ఎంతో సహకరిస్తాయని తెలిపారు. నేరం జరిగినా.. వెంటనే కేసును ఛేదించేందుకు వీలవుతుందన్నారు. రాచకొండలో సీసీ కెమెరాలు తక్కువగానే ఉన్నాయన్నారు. నేను సైతం ద్వారా ప్రజల సహకారంతో మరిన్ని కెమెరాలను ఏర్పాటు చేస్తామన్నారు. నేరగాళ్లు నంబర్ ప్లేట్ లేని వాహనాలపై తిరుగుతున్నారని తెలిపారు. నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్, నంబర్ ప్లేట్ వాహనాలపై చర్యలు తీసుకుంటామన్నారు.
మహిళల భద్రత
మహిళలను వేధిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ తెలిపారు. మహిళల ఫొటోలను మార్ఫింగ్ చేయడం, సోషల్ మీడియా, ఫోన్లలో అప్లోడ్ చేస్తామని వేధించే నేరగాళ్లపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. సైబర్స్టాకింగ్కు గురికాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. మహిళల భద్రతపై ప్రధానంగా దృష్టి పెట్టడంతో పాటు హాట్ స్పాట్స్ను గుర్తించి అక్కడ పెట్రోలింగ్ వాహనాలు తిరిగేలా చర్యలు తీసుకుంటాని తెలిపారు. స్కూళ్లు, కాలేజీలు, కార్యాలయాలు ఉన్న ప్రాంతాల్లో ఉదయం, సాయంత్రం పెట్రోలింగ్ పెంచుతామన్నారు. ఆయా రూట్లలో పోలీసు పెట్రోలింగ్ వాహనాలు తిరగడంతో విజుబుల్ పోలీసింగ్ పెరుగుతుందని, నేరగాళ్లలో భయం ఉంటుందన్నారు. నిర్భయంగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని, డయల్ 100, షీ టీమ్స్ను సంప్రదించాలని సూచించారు.
భూ కబ్జాలు.. సివిల్ తగాదాలపై సీరియస్
భూ తగాదాలు, భూ కబ్జాలు, నకిలీ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్లు చేసుకోవడం, బ్లాక్ మెయిలింగ్ ఘటనలను సీరియస్గా తీసుకుంటామన్నారు. ఇలాంటి నేరాలు జరిగితే తీసుకోవాల్సిన చర్యల కోసం గత సీపీ పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. అదే విధానాన్ని కొనసాగిస్తామన్నారు. ఎక్కడైతే పోలీసు అవసరం ఉంటుందో అక్కడికి వెళ్లి సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుండా వారి సమస్యల పరిష్కారానికి సూచనలు చేస్తామన్నారు.