ఖైరతాబాద్, ఫిబ్రవరి 4: క్యాన్సర్ వ్యాధిని ముందుస్తుగా గుర్తిస్తే పూర్తి స్థాయిలో నివారించవచ్చని, అందుకు ప్రజలు అవగాహన పెంచుకోవాలని స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కమాండెంట్ త్రినాథ్ నరుకుల్లా అభిప్రాయపడ్డారు. రెనోవా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో బుధవారం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా బైక్ ర్యాలీతో పాటు నెక్లెస్రోడ్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన త్రినాథ్ మాట్లాడుతూ.. గతంలో క్యాన్సర్ వస్తే ఇక నయం కాదు అనుకునేవారని, కాని నేడు ఆధునిక చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయని, ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయించుకోవాలన్నారు. ప్రస్తుతం క్యాన్సర్ పూర్తిగా నయమయ్యే వ్యాధుల జాబితాలో చేరిందన్నారు.
డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ (అడ్మినిస్ట్రేషన్) కె.శశిశ్రీ మాట్లాడుతూ.. ఒక కుటుంబంలో మహిళ అనారోగ్యం బారినపడితే దాని ప్రభావం అందరిపై ఉంటుందన్నారు. స్త్రీలు స్వీయ పరీక్షలు చేసుకోవాలని, శరీరంలో ఎక్కడైనా గడ్డలు లాంటివి గుర్తిస్తే తక్షణమే స్క్రీనింగ్ చేయించుకోవాలన్నారు. సామాజికవేత్త, ఆడియో ఇంజినీర్ డాక్టర్ సాజిదా ఖాన్, రెనోవా ఆస్పత్రి చీఫ్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ట్, రోబోటిక్, హైపెక్ సర్జన్ డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ ఇండివర్ కిరణ్, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ హేమంత్ కుమార్, డాక్టర్ పి.సత్య దత్తాత్రేయ, డాక్టర్ రాజేశ్, డాక్టర్ యుగంధర్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
నిమ్స్లో క్యాన్సర్ అవగాహన ర్యాలీ
వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా బుధవారం నిమ్స్ మెడికల్ ఆంకాలజీ విభాగం ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప ప్రారంభించగా, బంజారాహిల్స్ రోడ్ నం.1 నుంచి పంజాగుట్ట గేట్ వరకు కొనసాగింది. అనంతరం లెర్నింగ్ సెంటర్లో జరిగిన అవగాహన సభలో డైరెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో నిమ్స్లో అందుబాటులో ఉన్న ఆధునిక క్యాన్సర్ నిర్ధారణ, టార్గెటెడ్ థెరపి, చికిత్స సదుపాయాలను వివరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఉచిత స్క్రీనింగ్ శిబిరంలో బ్రెస్ట్, సర్వేకల్, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లకు సంబంధించిన పరీక్షలు నిర్వహించారు. నిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నిమ్మ సత్యనారాయణ, ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్ సదాశివుడు, డాక్టర్ శాంతివీర్ ఉప్పిన్, డాక్టర్ రంగనాథ్, డాక్టర్ మౌనిక మలిక్, డాక్టర్ మార్త రమేశ్ పాల్గొన్నారు.