హైదరాబాద్ : నగరంలోని ఆరంఘర్ నుంచి శంషాబాద్ వరకు రహదారికి ఇరువైపులా విస్తృత ప్లాంటేషన్ చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారుల అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI), జీహెచ్ఎంసీ అధికారులతో సీఎం శుక్రవారం బీఆర్కేఆర్ భవన్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. రహదారికి ఇరువైపుల పుష్పించే మొక్కలతో మల్టీకలర్/మల్టీలేయర్ అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టాలని ఈ మార్గంలో ప్రయాణించే ప్రజలకు హరిత అనుభవాన్ని అందించాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు.
అంతకుముందు తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా సీఎస్ మొక్కలు నాటారు. శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే ప్రధాన రహదారిపై బుద్వేల్ వద్ద జీహెచ్ఎంసీ చేపట్టిన మల్టీలెవల్ అవెన్యూ ప్లాంటేషన్ను పరిశీలించారు.
ఈ సమావేశంలో రవాణా, రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం. రిజ్వీ, ఆర్ అండ్ బీ ఇంజనీర్ ఇన్ ఛీప్ గణపతి రెడ్డి, ఎన్హెచ్ఏఐ అధికారులు, జాతీయ రోడ్లు రవాణా మంత్రిత్వశాఖ ప్రాంతీయ అధికారి ఎస్.కె. ఖుష్వా, ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ ధర్మారెడ్డి, తదితర అధికారులు పాల్గొన్నారు.