NRI | బంజారాహిల్స్, డిసెంబర్ 10: తాను విదేశాల నుంచి వచ్చానని.. తనవద్ద నుంచి ఆటో డ్రైవర్లు విదేశీ కరెన్సీతో పాటు ఖరీదైన వస్తువులు చోరీ చేశారు.. అంటూ మధురానగర్ పోలీసులకు తప్పుడు ఫిర్యాదు ఇచ్చి బురిడీ కొట్టించాడో యువకుడు. గతంలోనూ పోలీసులను ఇదే విధంగా మోసం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. పోలీసుల కథనం ప్రకారం.. గోవాకు చెందిన సబీ డిసిల్వా ఈనెల 8న అర్ధరాత్రి మధురానగర్ పీఎస్కు వచ్చాడు. తాను బెల్జియం నుంచి వచ్చానని, సీఎం రేవంత్రెడ్డిని చూసేందుకు జూబ్లీహిల్స్కు వెళ్లి.. అక్కడి నుంచి ఆటోలో రైల్వే స్టేషన్కు వెళ్తున్న క్రమంలో యూసుఫ్గూడ సమీపంలోని జానకమ్మ తోట వద్దకు తీసుకువెళ్లిన ఆటోడ్రైవర్లు తనవద్ద నుంచి 1200 యూరోలతో పాటు ల్యాప్టాప్, మొబైల్, తదితర వస్తువులను లాక్కుని దాడికి చేశారంటూ ఫిర్యాదు చేశాడు.
ఇంగ్లిషులో మాట్లాడాడు. అతడి మాటలు నమ్మిన మధురానగర్ పోలీసులు.. ఐపీసీ 394 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, తనవద్ద చార్జీలకు కూడా డబ్బులు లేవంటూ పోలీసుల వద్ద నుంచి రూ.1000 వసూలు చేసుకుని వెళ్లిపోయాడు. ఘటనా స్థలంతో పాటు ఇతర ప్రాంతాల్లో సీసీ ఫుటేజీలు పరిశీలించగా.. అలాంటి ఘటన అక్కడ జరగలేదని తేలింది. ఇదిలా ఉండగా.. తమకు ఫిర్యాదు చేసిన సబీ డిసిల్వా ఫోన్కు కాల్ చేయగా పనిచేయలేదు. దీంతో అతడి గురించి వాకబు చేయగా.. పలు విషయాలు బయటకు వచ్చాయి.
గతంలో కూడా జూబ్లీహిల్స్, భువనగిరి తదితర ప్రాంతాల్లో ఇదే విధంగా తన పర్సును కొట్టేశారని, వస్తువులు చోరీ చేశారంటూ.. పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసి అక్కడి పోలీసుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసినట్లు తేలింది. రెండ్రోజుల కిందట జూబ్లీహిల్స్ రోడ్ నం. 10లోని డైమండ్ హౌజ్ సమీపంలో ఉన్న ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకుంటున్న ఓ వ్యక్తి వద్ద నుంచి రూ.10వేలు తీసుకుని ఉడాయించినట్లు బాధితుడు ఆదివారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో నిందితుడి కోసం జూబ్లీహిల్స్ పోలీసులు గాలిస్తున్నారు.