పహడీషరీఫ్, సెప్టెంబర్ 19 : స్నేహితుల మధ్య తలెత్తిన వివాదం ఒకరి హత్యకు దారి తీసింది. ఈ ఘటన బాలాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ భాస్కర్ కథనం ప్రకారం.. బాలాపూర్ పరిధిలోని వాది ఏ సాల్హీన్ కాలనీలో నివాసముంటున్న సల్మాన్ అలియాస్ చావూస్ (25) ఆటో డ్రైవర్. షాహీన్నగర్కు చెందిన స్నేహితులైన సయ్యద్ అమీర్(24), మహ్మద్ జహీర్(20), మహ్మద్ మహబూబ్, షేక్ సోహెల్తో కలిసి ఆదివారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో కారులో టీ తాగడానికి షాహీన్నగర్లోని రాయల్ సీ హోటల్కు వెళ్లారు. హోటల్ మూసి ఉంది. ఆ తర్వాత వాది ఏ సాల్హీన్కు వెళ్లే క్రమంలో కారులో ఉన్న ఆటో డ్రైవర్ సల్మాన్, అతడి స్నేహితుల మధ్య మాటలతో వివాదం తలెత్తింది.
కోపంతో సల్మాన్ తను వెంట తెచ్చుకున్న కత్తితో స్నేహితుడు అమీర్పై దాడి చేయబోయాడు. అతడి నుంచి తప్పించుకున్న అమీర్.. మిగతా స్నేహితులతో కలిసి సల్మాన్ చేతిలో ఉన్న కత్తిని లాక్కున్నాడు. అదే కత్తితో సల్మాన్ కడుపులో, ఛాతిలో బలంగా పొడిచారు. సల్మాన్ కారులోనే మృతి చెందాడు. ఆ తర్వాత షాహీన్నగర్, గ్రీన్సిటీ సమీపంలో కారులో ఉన్న మృతదేహాన్ని అక్కడే వదిలి పారిపోయారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న బాలాపూర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని డాగ్ స్కాడ్, క్లూస్ టీం ద్వారా వివరాలు సేకరించారు. సీసీ ఫుటేజీలను పరిశీలించారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కారులో ఉన్న వారే హత్య చేశారని, పాతకక్షలే కారణంగా పోలీసులు భావిస్తున్నారు. అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.