హైదరాబాద్/ సిటీబ్యూరో, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్: స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్తో పాటు జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో ఫ్రీడం ర్యాలీలు నిర్వహించడంతో త్రివర్ణ పతాకాలు రెపరెపలాడాయి.
జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో హుసేన్సాగర తీరాన నిర్వహించిన ర్యాలీలో మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, మహమూద్ అలీ, వజ్రోత్సవ కమిటీ చైర్మన్ కే కేశవరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్రెడ్డి, కమిషనర్ లోకేశ్కుమార్, అదనపు డీజీ జితేందర్తోపాటు శానిటేషన్, ఎంటమాలజీ సిబ్బంది, డీఆర్ఎఫ్ బృందాలు, స్వయం సహాయక బృందాలు, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్ విద్యార్థులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో నిర్వహించిన ఫ్రీడం ర్యాలీని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. వివిధ జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన ర్యాలీల్లో మంత్రులు హరీశ్రావు, వేముల ప్రశాంత్రెడ్డి, పువ్వాడ అజయ్కుమార్, వీ శ్రీనివాస్గౌడ్, సత్యవతిరాథోడ్, ఎర్రబెల్లి దయాకర్రావు, గంగుల కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.
స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకల కార్యక్రమానికి ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. వజ్రోత్సవ కమిటీ చైర్మన్ కే కేశవరావు నేతృత్వంలో మం త్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, శ్రీనివాస్గౌడ్, సీఎస్ సోమేశ్కుమార్ వేడుకల ఏర్పాట్లను శనివారం పరిశీలించారు. ఈ వేడుకల్లో సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానుండటంతో పకడ్బందీ ఏర్పాటు చేశారు.
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఆదివారం అన్ని జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో జానపద కళాకారుల ప్రదర్శన లు నిర్వహించనున్నారు. తెలంగాణ సాంస్కృతిక సారథి సమన్వయంతో జానపద కళాకారుల ప్రదర్శలు ఉండనున్నాయి. అదేవిధంగా సా యంత్రం వేళ అన్ని జిల్లా కేంద్రాల్లో బాణా సంచా వేడుకలను నిర్వహించనున్నారు.
పంద్రాగస్టు వేడుకలకు సంబంధించిన పోలీసులు పూర్తిస్థాయి రిహార్సల్స్ను శనివారం గోల్కొండ కోటలో నిర్వహించారు. వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలిసి సీఎస్ సోమేశ్కుమార్ ఈ ఫుల్డ్రెస్ రిహార్సల్స్ను పరిశీలించారు. ఈ నెల 15న ఉదయం పదిన్నర గంటలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు గోల్కొండ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు.
అంతకుముందు ఆయన పోలీసుశాఖ గౌరవవందనాన్ని స్వీకరిస్తారు. జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం రాష్ట్రీయ సెల్యూట్ను పోలీస్ దళాలు చేపడుతాయి. కార్యక్రమానికి హాజరయ్యే వారికి ప్రత్యేక పాసులను అధికారులు జారీ చేశారు. గోల్కోండ కోటలో సందర్శకుల కోసం సమాచారశాఖ ప్రత్యేక స్క్రీన్లను ఏర్పాటు చేసింది.
మంచినీటి సౌకర్యంతోపాటు అకస్మాత్తుగా వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా వాటర్ప్రూఫ్ టెంట్లను వేశారు. మరోవైపు ఉగ్రదాడుల ముప్పు పొంచి ఉన్నదన్న కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికల నేపథ్యంలో స్వాతం త్య్ర వేడుకలకు రాష్ట్రంలో పటిష్ట భద్రతను కట్టుదిట్టం చేశారు. హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్రంలోని అన్ని ముఖ్య పట్టణాల్లో పోలీసులు గస్తీని ముమ్మరం చేశారు.