Hyderabad | సిటీబ్యూరో, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): ఏటీఎంలో గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడుతున్నారని డయల్ 100 ద్వారా రాచకొండ పోలీసులకు వచ్చిన సమాచారంతో 5 నిమిషాల వ్యవధిలో ఘటనా స్థలానికి చేరుకొని ఏటీఎం చోరీకి యత్నించిన వ్యక్తిని పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం… మౌలాలిలోని ఎస్బీఐ ఏటీఎం కేంద్రంలో సోమవారం అర్ధరాత్రి 12.15 గంటల సమయంలో అలికిడి రావడంతో బ్యాంకు మెయిన్ సర్వర్కు సిగ్నల్స్ వెళ్లాయి. దీంతో బ్యాంకు అధికారులు డయల్ 100కు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న ఇన్స్పెక్టర్, ఎస్సైలు, అదే ఏరియాలో ఉన్న పెట్రోలింగ్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. వారు ఏటీఎం కేంద్రం వద్దకు ఐదు నిమిషాల్లోపే చేరుకున్నారు.
ఏటీఎం లోపల ఒక వ్యక్తి ఏటీఎంను తెరిచేందుకు యత్నిస్తూ కనిపించాడు. వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని విచారించారు. ఛత్తీస్గఢ్కు చెందిన పంకజ్కుమార్ కొంత కాలంగా మౌలాలిలో నివాసముంటున్నాడు. ఏటీఎం కేంద్రం వద్ద ఎవరు లేకపోవడంతో అందులోకి వెళ్లి ఏటీఎంను పగులగొట్టి, డబ్బు తీసుకోవడానికి ప్రయత్నించినట్లు వెల్లడించాడు. కాగా అర్ధరాత్రి అప్రమత్తంగా ఉంటూ భారీ చోరీ జరగకుండా కాపాడిన మల్కాజిగిరి ఇన్స్పెక్టర్ బోరోజు రవికుమార్, సెక్టార్ ఎస్సై హరిప్రసాద్, ఏఎస్సై సుబ్బారాయుడు, పెట్రోలింగ్ మొబైల్ హెడ్ కానిస్టేబుల్ రాంచందర్, హోంగార్డు హరికాంత్ను రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్, క్రైమ్స్ డీసీపీ మధుకర్ స్వామి ప్రశంసించి, రివార్డు అందజేశారు.