ఖైరతాబాద్, జూన్ 11 : ఫేక్ పత్రాలతో కోట్లాది రూపాయల విలువైన భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని న్యాయవాది మోయిజ్ ఖాన్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, బాలానగర్ మండలం, హస్మత్పేట గ్రామంలోని సర్వే నం. 57లోని పదెకరాల ప్రభుత్వ స్థలం ఉందన్నారు. ప్రస్తుతం చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ పరిధిలో ఈ స్థలం వివాదంలో హైకోర్టులో ఉండగా, కొందరు భూ కబ్జా దారులు తప్పుడు పత్రాలతో ఈ భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారన్నారు.
అందులో భాగంగా ఓ వ్యాపారి ఏకంగా సర్వే నం.57 పత్రాలను ఫోర్జరీ చేసి ఈ స్థలం సర్వే నం. 157/1గా మార్చి ప్లాట్లుగా విభజించి నిర్మాణ అనుమతులను పొందాడన్నారు. కోర్టులో వివాదం కొనసాగుతుండగా, దీనిపై నిర్మాణ అనుతులు ఎలా వచ్చాయని, ఇందులో సంబంధిత అధికారులు అక్రమాలకు పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పూర్తి స్థాయిలో విచారణ జరిపించి ఈ భూమిని కాపాడాలని కోరారు.