బంజారాహిల్స్,ఫిబ్రవరి 25: సుప్రీంకోర్టు న్యాయవాది కుటుంబం ఆధీనంలో ఉన్న స్థలాన్ని ఆక్రమించేందుకు అర్థ్ధరాత్రి గుండాలతో వచ్చి వీరంగం సృష్టించిన ఘటనలో 12మందిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వివరాల్లోకి వెళ్లే.. జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 5లోని అన్నపూర్ణ స్డూడి యో సమీపంలో ప్లాట్ నం85, 86లో 1000 గజాల అసైన్డ్ స్థలం 1990 నుంచి సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ఉన్న ముదిగంటి విశ్వనాథరెడ్డితో పాటు అతడి భార్య సురేఖారెడ్డి ఆధీనంలో ఉంది. 1999లో ఈ స్థలంలోని కొంతభాగంలో ఇల్లు కట్టుకోవడంతో పాటు మిగిలిన స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించుకుని అక్కడే ఉంటున్నారు. గతంలోనే ఈ స్థలాన్ని క్రమబద్ధీకరించాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవడంతో పాటు నిర్దేశిత రుసుం చెల్లించారు. అయితే ఈ స్థలంపై పలువురు వ్యక్తులు బోగస్ పత్రాలు సృష్టించడంతో వివాదం నెలకొంది. ఈ వివాదాలన్నీ వివిధ న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్నాయి.
ఇదిలా ఉండగా అదే ప్రాంతంలోని మరో ప్లాట్కు సంబంధించిన డాక్యుమెంట్స్ను 2002లో ఓ వ్యక్తివద్ద కొనుగోలు చేసిన పరమేశ్వరరామ్ అనే విశ్రాంత గ్రూప్ వన్ అధికారి విశ్వనాథరెడ్డికు చెందిన స్థలంలో తాను కొనుకున్న సమయంలో 700గజాలు ఉందంటూ గత కొన్ని సంవత్సరాలుగా వాగ్వాదం జరగడంతో పాటు కోర్టులో సైతం కేసు వేశారు. అయితే స్థలంలో పొజిషన్ కలిగి ఉన్న వారికే కోర్టులో తీర్పులు అనుకూలంగా వచ్చే అవకాశం ఉందని భావించిన పరమేశ్వరరామ్ ప్రోద్భలంతో శుక్రవారం రాత్రి 70మంది రౌడీలు, మహిళలు స్థలంలోకి ప్రవేశించారు. అక్కడున్న వాచ్మెన్ను బెదిరింపులకు గురిచేయడంతో పాటు విశ్వనాథ్రెడ్డి ఇంట్లోకి ప్రవేశించి సామన్లు పగలగొట్టి బీభత్సం సృష్టించారు. కర్రలు, రాడ్స్, కారంపొడి ప్యాకెట్లతో వచ్చి అక్కడనుంచి బయటకు వెళ్లిపోవాలంటూ బెదిరింపులకు దిగారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు తెల్లవారుజామున అక్కడకు చేరుకున్నారు. పోలీసుల రాకను గమనించిన పలువురు రౌడీలు అక్కడినుంచి పారిపోగా కొంతమందిని పోలీసులు పట్టుకున్నారు. బంజారాహిల్స్ ఏసీపీ శ్రీధర్, జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్రెడ్డి తదితరులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అనంతరం బాధితుడు విశ్వనాథ్రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో స్థలాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నించిన పరమేశ్వరరామ్తో పాటు అతడికి సహకరించిన ఎల్.తిరుపతిరెడ్డి తదితరులపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడితో సహా 12మందిని అరెస్ట్ చేశారు.