బంజారాహిల్స్ : బీజేపీ సీనియర్ నేత డీకే.అరుణ కుమార్తె శృతిరెడ్డితో పాటు మరో మహిళపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం 7లో నివాసం ఉంటున్న నిర్మాత, వ్యాపారవేత్త పొట్లూరి వరప్రసాద్ ఇంటికి సంబంధించిన నిర్మాణపనులను పర్యవేక్షించేందుకు బోరబండకు చెందిన ఎం.ఎలీషాబాబు సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు.
కాగా ఇటీవల ఇంటికి సంబంధించిన ప్రహరీ నిర్మాణం చేస్తుండగా స్థలాన్ని ఆనుకుని ఉన్న ప్రేమ్ పర్వత్ విల్లాస్ లో నివాసం ఉంటున్న డీకే. శృతిరెడ్డి. వినోద అనే మహిళ గత నెల 16న అడ్డుకున్నారు. ఈ సమయంలో ఇరువర్గాలు దూషించుకున్నాయి. శృతి రెడ్డి ఫిర్యాదుతో పీవీపీతో పాటు అయన అనుచరులపై కేసు నమోదయింది.
అయితే అదే సమయంలో విధుల్లో ఉన్నతనను శృతిరెడ్డి. వినోద తదితరులు తీవ్ర పదజాలంతో దూషించడంతో పాటు దాడి చేశారంటూ ఎలీషాబాబు ఇటీవల కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో బుధవారం బంజారాహిల్స్ పోలీసులు శృతిరెడ్డి. వినోదలపై ఐపీసీ 323,336,384,448తో పాటు ఎస్సీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.