కంటోన్మెంట్, ఏప్రిల్ 10: కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ప్రతి వార్డులో అభివృద్ధి, సంక్షేమంతో పాటు బీఆర్ఎస్ బలోపేతమే లక్ష్యంగా పని చేద్దామని మల్కాజిగిరి పార్లమెంట్, కంటోన్మెంట్ నియోజకవర్గం ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం బోయిన్పల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో కంటోన్మెంట్ నియోజకవర్గం ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం నియోజకవర్గానికి చెందిన దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తెలు, ముగ్గురు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, బోర్డు మాజీ సభ్యులు, పార్టీ ముఖ్య నేతలతో మర్రి రాజశేఖర్రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా నియోజకవర్గంలో పార్టీ బలోపేతంతో పాటు ఆత్మీయ సమ్మేళనాలు, పార్టీ ఆవిర్భావ వేడుకలు, అంబేద్కర్ విగ్రహావిష్కరణ, సచివాలయం ప్రారంభం వంటి అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు.
అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మర్రి రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ దివంగత ఎమ్మెల్యే సాయన్న ఆశయాలకు అనుగుణంగా సాగుతూ, అందరినీ సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకుసాగుతానని స్పష్టం చేశారు. ఎనిమిది వార్డులతో పాటు మోండా డివిజన్ పరిధిలో అభివృద్ధి, సంక్షేమంతో పాటు బీఆర్ఎస్ను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కార్యాచరణ రూపొందించడం జరుగుతుందన్నారు. కంటోన్మెంట్ ప్రాంతం రక్షణశాఖ ఆధీనంలో ఉన్నప్పటికీ కేంద్రం అభివృద్ధి చేయడంలో మీనమేషాలు లెక్కిస్తుందని, కానీ రాష్ట్ర సర్కారు చొరవ తీసుకొని సంక్షేమంతో పాటు అభివృద్ధి పనులకు నిధులను కేటాయిస్తుందని వెల్లడించారు.
దాచుకో.. దోచుకో ఇదే బీజేపీ విధానం
దేశంలోనే కాకుండా కంటోన్మెంట్ ప్రాంతంలో కూడా దాచుకో.. దోచుకో అన్న విధానాన్నే బీజేపీ అవలంభిస్తున్నదని మర్రి రాజశేఖర్రెడ్డి మండిపడ్డారు. కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు నిర్వహించకుండా ప్రజాస్వామ్యాన్ని ఆపహస్యం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. కంటోన్మెంట్ ప్రాంతంలో ఇటీవల నిర్వహించిన సభలో మోదీ కనీసం రాష్ర్టానికి నిధులు ఇవ్వకుండా విషం చిమ్మే విధంగా ప్రసంగించడం హేయమైన చర్యగా అభివర్ణించారు. కంటోన్మెంట్ బోర్డుకు సుమారు రూ.750కోట్ల మేర సర్వీస్ చార్జీలు రావాల్సి ఉన్నా విడుదల చేయడం లేదని, బోర్డు ఉద్యోగస్తులకు కనీసం జీతాలు ఇవ్వలేని పరిస్థితి దాపురించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ల చైర్మన్లు గజ్జెల నాగేశ్, ఎర్రోళ్ల శ్రీనివాస్, మన్నె క్రిశాంక్, దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తెలు లాస్యనందితా, నివేదిత, బీఆర్ఎస్ సీనియర్ నేతలు శ్రీ గణేశ్, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి, మాజీ సభ్యులు ప్రభాకర్, పాండుయాదవ్, నళినికిరణ్, లోక్నాథం, నేతలు టీఎన్ శ్రీనివాస్, ముప్పిడి మధుకర్, ప్రవీణ్యాదవ్, అజయ్యాదవ్, నర్సింహ్మ ముదిరాజ్, నర్సారెడ్డి, దేవులపల్లి శ్రీనివాస్, సదానంద్గౌడ్, తేజ్పాల్, సరిత, భాస్కర్ ముదిరాజ్, శ్రీనివాస్, రాజుసింగ్, సుజిత్, జయరామ్, శేఖర్ ముదిరాజ్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.