సచివాలయానికి కూతవేటు దూరంలో ఉన్న తెలుగు తల్లి ఫ్లై ఓవర్పై శుక్రవారం ఉదయం 11 గంటలకు ఇరువైపులా వాహనాల రద్దీ ఉండగానే ప్రమాదకరంగా జీహెచ్ఎంసీ కార్మికులతో ఫ్లైవోవర్ను శుభ్రం చేయించారు. వాస్తవానికి ఫ్లై ఓవర్లపై స్వీపింగ్ మిషిన్లతో పరిశుభ్రత చర్యలు చేపట్టాల్సిన బల్దియా కార్మికులకు రక్షణ చర్యలు లేకుండా ప్రాణాలను ఫణంగా పెట్టి వెట్టి చేయిస్తుందనడానికి ఇదో మచ్చుతునక.
మీరెందుకు ఊడుస్తున్నారని కార్మికులను ప్రశ్నిస్తే రెండు, మూడు రోజులకొకసారి మేమే ఈ ఫ్లై ఓవర్ పరిశుభ్రత పనులు చేస్తామని, కమిషనర్ వస్తున్నాడని చెబితే ఈ పనులు చేస్తున్నట్లు సర్కిల్-15 (ముషీరాబాద్)కు చెందిన ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులు చెప్పడం కొసమెరుపు. ఈ విషయంపై శానిటేషన్ విభాగం అదనపు కమిషనర్ ఉపేందర్ రెడ్డిని ఫోన్లో వివరణ కోరే ప్రయత్నం చేయగా అందుబాటులోకి రాలేదు.
– సిటీబ్యూరో, జనవరి 19 (నమస్తే తెలంగాణ)