బంజారాహిల్స్, మే 19 : సినిమా షూటింగ్లో పని ఉందంటూ యువతిని బైక్ మీద ఎక్కించుకుని గదిలో రెండ్రోజుల పాటు బంధించి లైంగికదాడి చేసిన ఘటనలో ఇద్దరు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. అనాథ శరణాలయంలో పెరిగిన యువతి ఇటీవల మరో యువతితో కలిసి కొంతకాలం పాటు ఓ హోటల్లో పనిచేస్తూ అక్కడే ఉండేది. కాగా ఇటీవల ఉద్యోగం మానేసి జూబ్లీహిల్స్ రోడ్ నెం 5లోని మెట్రోస్టేషన్ ప్రాంతంలో ఉంటూ సినిమా షూటింగ్స్లో పనికి వెళ్తోంది. ఈ నెల 14న తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఓ వ్యక్తి మెట్రో స్టేషన్ వద్దకు వచ్చి సినిమా షూటింగ్ పని ఉందంటూ బైక్ మీద ఎక్కించుకుని సికింద్రాబాద్లోని ఓ గదికి తీసుకువెళ్లాడు.
అక్కడున్న మరో వ్యక్తితో కలిసి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. లైంగికదాడికి పాల్పడ్డారు. రెండ్రోజుల పాటు అదే గదిలో ఉన్న యువతిని 16న సాయంత్రం ర్యాపిడో బుక్ చేసి జూబ్లీహిల్స్ రోడ్ నెం 5కు పంపించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. లైంగికదాడికి పాల్పడిన వారిని జిల్లా శ్రీనివాస్, పుల్లూరి రితీష్గా గుర్తించిన పోలీసులు వారిని మంగళవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. వారిద్దరూ ఒంటరిగా ఉన్న యువతిని షూటింగ్ పేరుతో తీసుకువెళ్లి లైంగికదాడికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది.