కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వేతనం రూ. 18వేలకు చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీఆర్టీయూ అనుబంధ ఆశ వర్కర్ల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన ‘చలో అసెంబ్లీ’ ఉద్రిక్తతకు దారితీసింది. సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్క్ వరకు ర్యాలీ నిర్వహించడంతో పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్తో పాటు ఆశ వర్కర్లను అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. పోలీసుల తోపులాటలో ఇద్దరు ఆశవర్కర్లు అస్వస్థతకు గురయ్యారు. కాగా, ఆశ వర్కర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. వీరి పోరాటానికి మాజీ ఎంపీ వినోద్కుమార్ మద్దతు తెలిపారు.
ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణమే విడుదల, జీవో నం. 97ను రద్దు చేయడంతో పాటు 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలంటూ.. శుక్రవారం బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విద్యార్థులు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. బషీర్బాగ్ నుంచి అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన విద్యార్థి నేతలను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.

ఆరు గ్యారెంటీలు,420 హామీల అమలు, ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి, విద్యా భరో సా కార్డు వంటివి ఇచ్చే వరకు పోరాటం చేస్తామని బీఆర్ఎస్వీ నేతలు చెప్పారు. జీవో నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకుండా నిరసనలకు ముందే అరెస్టు చేయడం ఏమిటని ప్రశ్నించారు.